ధాన్య సేకరణలో అక్రమాలకు ఆస్కారం ఉండకూడదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ విధానంలో అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండకూడదని స్పష్టం చేశారు. అదే జరిగితే సహించబోనని అధికారుల సమావేశంలో తెలిపారు. వివరాలలోకి వెళితే…
కష్టించే రైతుకు సరైన మద్దతు ధర లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రైతు కష్టానికి దళారులు ధర నిర్ణయించి వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే విషయంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ఫామ్ గేట్ వద్దే ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను తొలగిస్తున్నామని చెప్పారు. ఈ విధానంతో రైతులకు మంచి ధర దక్కుతుంది. అందులో భాగంగానే కొత్త విధానాన్ని సవాల్గా తీసుకుని అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. మరీ ముఖ్యంగా ఆధార్ నంబర్ ఆధారంగా రైతులకు చెల్లింపులు చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, అగ్రి మార్కెటింగ్ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఏపీఎస్సీఎస్సీఎల్ వీసీ అండ్ ఎండీ జి.వీరపాండ్యన్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
#cmysjagan #graincollection #millers #apnews #agriculturelatestnews