మన దేశము సుగంధద్రవ్యాల ఉత్పత్తి మరియు ఎగుమతులలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2023-24 సంవత్సరంలో మన దేశంలో సుమారు 4.76 మిలియన్ హెక్టార్లలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాల పంటలను రైతులు సాగు చేశారు. తద్వారా దేశంలో సంవత్సరానికి 11.80 మిలియన్ మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాల పంటలను ఉత్పత్తి చేసాము. సుగంధ ద్రవ్యాల పంటలన్నిటిలో ఉత్పత్తి మరియు ఎగుమతులలో మిరప పంట మొదటి స్థానంలో ఉంది. 2023- 24 సంవత్సరంలో దేశంలో సుమారు 2.59 మిలియన్ టన్నుల ఎండుమిరపకాయలను ఉత్పత్తి చేయడం జరిగినది. దేశంలో సుగంధ ద్రవ్యాల మొత్తం సాగు విస్తీర్ణంలో 17.0 % మరియు ఉత్పత్తిలో 21 % మిరప పంట సాగు చేయబడుతుంది. సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో 6,54,269 టన్నుల మిరపకాయలను 1,47,547 హెక్టార్లలో ఉత్పత్తి చేయడం జరిగినది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ విస్తిర్ణంలో మిరప సాగు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 2,37,053 హెక్టార్లలో మిరప పంట సాగు చేయడం ద్వారా సుమారు 11,85,265 మెట్రిక్ టన్నుల మిరపకాయ పంట ఉత్పత్తితో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలు మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి.
మిరప లో లాభాలను పొందటానికి సాగు సమయం లో అవలబించే యాజమాన్య పద్దతుతో పాటు పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనవి.
. పంటకోత అనంతరము తగిన జాగ్రత్తలు తీసుకొని ఎడల కాయ బరువు, నాణ్యత తగ్గి వాటిలో ఉన్న నాణ్యత ప్రమాణాలు అయినటువంటి రంగు, గాఢత మరియు అఫ్లోటాక్సిన్ శాతం లో తేడా వచ్చి మార్కెట్లో మిరప పంట యొక్క ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల కూరలలో మరియు వివిధ రకాల ఆహార పదార్థాలలో కారప్పొడి విరివిగా వినియోగిస్తున్నాం. మనం మార్కెట్లో చూసే చాలా రకాల ఆహార పదార్థాలలో మిరపపొడి తో పాటు వాటి నుండి తీసిన ఓలియోరెసిన్, నూనె మరియు రంగు పదార్థాలను వివిధ రకాల మసాలాలు,మాంసాహార ఉత్పత్తులలో, బేకరీ, స్నాక్స్, చాక్లెట్, పానీయాల తయారీలో భాగంగా పరిశ్రమల ముడిసరుకుగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు.ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే మిరప పంటను ప్రధాన వాణిజ్యపంటగా పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో గుంటూరు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో మిరప పంటను అధిక మొత్తంలో సాగు చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు రైతులు పంట పండించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా కోసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన పంట యొక్క నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో సరైన ధర లేక పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మిరప పంట ధరను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిరపకాయల యొక్క రంగు మరియు గాఢత ప్రమాణాలను ఆధారముగా చేసుకొని నిర్ణయిస్తారు.
మంచి రంగు , గాఢత , పంట కోసే సమయంలో మరియు పంట కోసిన తర్వాత ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.
మిరప కాయ కోతలకు కనీసం ఇరవై రోజుల ముందు సస్యరక్షణ మందులు పిచికారి చేయరాదు.
మొక్కల మీద మిరపకాయలు పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోసి ఎండ పెట్టవలెను.
మిరప పండ్లను కోసేటప్పుడు నాణ్యత ప్రకారం గ్రేడింగ్ చేయవలెను.మంచి రంగు కాయలు ఒక బుట్టలో తాలుకాయలు వేరొక బుట్టలో వేయాలి.
కోసిన మిరపకాయలను శుభ్రమైన బుట్టలో గాని సంచులలో గాని నింపి కల్లానికి తీసుకెళ్లాలి.
కళ్ళంలో పోసిన వెంటనే ఆర పెట్టకుండా కనీసం ఒకటి లేదా రెండు రోజులు నీడలో రాసిగా పోయాలి. తద్వారా కాయకు మంచి రంగు వస్తుంది. నాణ్యతా ప్రమాణాల లో రంగు అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి ప్రామాణిక అంశం.
కళ్ళంలో ఆరబోసిన కాయలు తొక్క కుండా దారులను ఏర్పాటు చేసుకోవాలి.
కాయలను సిమెంట్ కళ్ళం, ఇసుక కళ్ళం లేదా టార్పాలిన్ సీట్లపై మాత్రమే ఆరబెట్టాలి.
మిరప కాయలను ఆరబెట్టే కల్లాలను గ్రామానికి దూరంగా ఉన్న పరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారు చేసుకోవాలి.
కళ్లంలో పోసిన కాయలన్ని సమంగా ఆరటానికి రోజు మార్చి రోజు కాయలను తిరగ కలపాలి.
కల్లంలో ఆరబెట్టిన మిరప పండ్లను మూడు దఫాలుగా తప్పక గ్రేడింగ్ చేయవలెను.
50% తేమ శాతం ఉన్నప్పుడు,
2.20%తేమ శాతం ఉన్నప్పుడు,
3.9-11%తేమ శాతం ఉన్నప్పుడు రైతులు బస్తాలను నింపవలెను.
ఎండిన కాయల నుండి తాలు, మచ్చలున్న మరియు తక్కువ రంగు కలిగిన కాయలను వేరు చేసి విడివిడిగా సంచులలో నింపవలెను.
ఎండాకాలం లో మిరపకాయలను తొక్కే ముందు పరిశుభ్రమైన స్ప్రేయర్లు తో మంచినీటిని మాత్రమే మిరపకాయల పై పిచికారి చేయాలి.
వర్షాలు కురిసే సమయంలో కోతలు కోయరాదు.
బస్తాల మీద ఎటువంటి రంగును వాడరాదు అఫ్లోటాక్సిన్ వ్యాప్తి చెందకుండా మిరపకాయలను పట్టాల మీద లేదా సిమెంట్ గచ్చు మీద మాత్రమే పెట్టవలెను.
రాత్రి సమయంలో మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి.
మిరప లో తేమ శాతం 9-11% కన్నా ఎక్కువగా ఉండకుండా ఎండబెట్టాలి.
తేమ శాతం పెరగడం వలన అప్లోడ్ టాక్సిన్ వృద్ధి చెందే అవకాశం ఉంది.
ఆహారపదార్ధాలలో తేమ అధికంగా ఉండటంవలన శిలీంద్రాలు వృద్ధిచెంది ప్రమాదకరమైన టాక్సిన్లు ఉత్పత్తి చేసి ఆహారాన్ని విషతుల్యం గా మారుస్తాయి. ముఖ్యంగా మిరప పంటలో అఫ్లోటాక్సిన్ అనే విష పదార్థము మిరపలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధి చెంది మిరపకాయ మొత్తము వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రైతు సోదరులు కూడా మిరపకాయలు కోసి చూసినట్లయితే మనకు నల్లని బూజు వంటి శిలీంద్రం కనిపిస్తుంది. అదే ఈ అఫ్లోటాక్సిన్ ఉత్పత్తి చేసే శిలీంద్రం. ముఖ్యంగా అస్పెర్జిల్లాస్ ఫ్లావాస్, అస్పెర్జిల్లాస్ పారాలైటికాస్ అనే శిలీంద్రాలు అఫ్లోటాక్సిన్ ను మిరపకాయలలో విడుదల చేస్తున్నాయి. అఫ్లోటాక్సిన్ పరిమాణము ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి మార్కెట్లో గిరాకీ ఉండదు. కావున రైతు సోదరులు కోసిన తరువాత మిరపకాయలు ఎండపెట్టిన తరువాత తేమశాతం 9 నుండి 11% లోపు ఉండే విధంగా చూసుకోవాలి.
మిరప పంట కోత తరువాత ఆశించే శిలీంద్రాలలో అస్పెర్జిల్లాస్ ఫ్లావాస్ అనే శిలీంద్రం అతి ముఖ్యమైనది. ఈ శిలీంద్రం అఫ్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తుంది.
అఫ్లోటాక్సిన్ సోకడానికి గల కారణాలు:
కోతకు ముందు మిరప పంట వర్షాభావ పరిస్థితులకు గురైనప్పుడు వృద్ధి చెందుతుంది.
మిరపకాయలు సాగునీటిలో తడి చినప్పుడు, సరైన సమయంలో మిరపకాయలు కోయనప్పుడు.
మిరపకాయలను అపరిశుభ్రమైన నేలపైన పెట్టినప్పుడు, గ్రేడింగ్ చేయకపోవడం వలన తెగుళ్ళు, పురుగులు ఆశించిన కాయల నుండి మంచి కాయలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
కోతకు వచ్చిన కాయలు కళ్ళాల్లో ఆరుతున్న సమయం లో కాయలు అకాల వర్షాలకు గురైనప్పుడు, సాధారణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు, మిరపకాయలు ఎండుటకు ఎక్కువ కాలం పడుతుంది కావున కాయల్లో తేమ శాతం తొందరగా తగ్గదు. ఈ పరిస్థితిలో బూజు హాని చేసే స్థాయి పెరిగి పంటకు ధర లేకుండా చేస్తుంది.
నిలువ చేసే సమయంలో మిరపకాయలు మరియు వాటి సంబంధిత ఉత్పత్తుల తేమశాతం 11% ఎక్కువగా ఉన్నట్లయితే ఇది మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
అప్లోటాక్సిన్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు:
కోతకుముందు వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లయితే మిరప పంటకు నీటి తడులు ఇవ్వాలి. సాగునీరు మిరపకాయలకు తాకకూడదు. ఈ నీరు తాకితే ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాయలను నేల మీద ఆర పెట్టకూడదు. మిరపకాయలను టార్పాలిన్ పట్టాల పైన లేదా సిమెంట్ ఫ్లోర్ లేదా ఇసుక కళ్ళం మీద ఆరబెట్టాలి. రాత్రి సమయంలో మిరపకాయలు మంచు బారిన పడకుండా టార్పాలిన్ పట్టాలతో కప్పాలి. కాయ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర పోషిస్తుంది కావున కాయలు కోసినప్పుడు మిరపలో 75 నుంచి 80 శాతం తేమ ఉంటుంది దీనిని 10 నుంచి 11 శాతం వచ్చేవరకు ఆరబెట్టాలి. ఏ కోత కీ ఆ కోత కాయలను వేరు చేసి ఆరపెట్టుకోవాలి. ఎండిన మిరపకాయలను నింపేముందు నీటిని చిలక రాదు. కాయలను గాలి సోకకుండా బస్తాలలో ప్యాక్ చేయాలి. చల్లని చీకటి ప్రదేశంలో నిల్వ ఉంచాలి.
మిరపకాయల కోత అనంతరం తగు జాగ్రత్త చర్యలు తీసుకొని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఎండబెట్టినట్టయితే జాతీయంగా మరి అంతర్జాతీయంగా అధిక ధర పలికే అవకాశం ఉంది.
ఎ. పోశాద్రి, యం. సునీల్ కుమార్, కె. రాజశేఖర్, జి. శివ చరణ్, డి. మోహన్ దాస్, వై. ప్రవీణ్ కుమార్
కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్.