ఆంధ్రప్రదేశ్వ్యవసాయ పంటలు

వరిలో మొలక శాతాన్ని నిర్ధారించు పద్ధతులు- ఆవశ్యకత

0

వ్యవసాయ పంటలలో అధిక దిగుబడి సాధించడానికి గల అనేక కారణాలలో మేలైన విత్తనం ఎన్నుకోవడం అత్యంత ప్రధానమైనది. అధిక దిగుబడులను సాధించాలంటే వ్యవసాయ పద్ధతిలో వివిధ అధునాతన పద్ధతులను అవలంభించడంతోపాటు నాణ్యమైన లక్షణాలున్న విత్తనాన్ని ఎంపిక చేయడం కూడా అత్యంత ప్రధానమైనది. ఇందులో అధిక మొలక శాతాన్ని కలిగి ఉండటం అతి ముఖ్యమైన లక్షణం. అందువలన వరిని పండించే రైతులు నారుమడులను తయారు చేసే ముందు విత్తనము యొక్క మొలక శాతాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అధిక మొలక శాతం మరియు మంచి లక్షణాలున్న విత్తనాన్ని పెంచుకోవడం ద్వారా దాదాపుగా 10- 15 శాతం అధిక దిగుబడును సాధించినట్లే. సాధారణంగా రైతులు విత్తనాలను వ్యవసాయ పరిశోధనా స్థానం లేదా వ్యవసాయ అధికారుల నుంచి మరియు ఇతర ప్రైవేటు వ్యాపారస్తుల నుండి సేకరిస్తారు. దీనివలన సమయం వృధా అవుతుంది మరియు అధిక వ్యయంతో కూడుకున్న పని కూడా కాబట్టి రైతులు వారి పొలంలోనే విత్తనాలను తయారు చేసుకుంటే సమయం మరియు డబ్బు కూడా ఆదా అవుతుంది.

విత్తేముందు రైతులు తాము సేకరించిన విత్తన మొలక శాతాన్ని పరీక్షించుకోవచ్చు. వరిలో కనీస నాణ్యతా ప్రమాణాలను అనుసరించి మంచి విత్తనానికి కనీసం 80%  శాతం మొలక ఉండవలెను. అంటే నూటికి 80% గింజలు మొలకెత్తితే ఆ విత్తనాన్ని నాణ్యమైన విత్తనంగా నిర్ధారించుకోవచ్చు. కావున రైతులు ఈ మొలక శాతాన్ని బట్టి వారికి కావాల్సిన నాణ్యమైన విత్తనాన్ని పొందుటయే గాక విత్తనాన్ని ఎంత మోతాదులో వినియోగించాలో కూడా నిర్ధారించుకోవచ్చు. అధిక మొలక శాతం గల విత్తనాన్ని తక్కువ మోతాదులోనూ, తక్కువ మొలక శాతాన్ని కలిగిన విత్తనాన్ని అధిక మోతాదులోనూ ఉపయోగించి వారికి సరిపడే నారును పొందవచ్చు.

విత్తన మొలక శాతాన్ని నిర్ధారించే పద్ధతులు :

పెట్రీ డిష్ పద్ధతి:  పెట్రీ డిష్ లో గుండ్రంగా కత్తిరించిన బ్లాటింగ్ పేపర్ను పెట్టి దానిని నీటితో తడపాలి. ఆ తడిపిన బ్లాటింగ్  పేపరు పైన 100 వరి గింజలను లెక్క గట్టి ఉంచవలెను తర్వాత పెట్రీ డిష్ మూతను పెట్టవలెను. అప్పుడప్పుడు నీటితో తడుపుతూ తేమ తగ్గకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఐదు రోజుల తర్వాత మొలక శాతం తెలుసుకోవచ్చు.

పేపర్ టవల్ పద్ధతి:

మందపాటి పేపర్ను నీటిలో బాగా తడిపి నేలపై పరిచి దానిపై 100 గింజలను పల్చగా చల్లి, చాపను చుట్టినట్లు చుట్టి  తేమపోకుండా రోజు నీళ్లు చల్లుతూ ఉండాలి. దీనికి న్యూస్ పేపర్ ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా కూడా ఐదు రోజుల తర్వాత విత్తన మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు.

గుడ్డ మూట పద్ధతి:

మార్కెట్ నుండి తెచ్చిన విత్తనాలు నుంచి 100 గింజలను లెక్కపెట్టి వాటిని ఒక గుడ్డలో మూటకట్టి ఒకరోజు నీటిలో  నానబెట్టాలి. నానబెట్టిన గుడ్డను మండె కట్టి 24 గంటల తర్వాత చూస్తే విత్తనాలు మొలకెత్తి ఉంటాయి. వాటిలో నూటికి 80 గింజలు మొలకెత్తితే ఆ విత్తనాన్ని నాణ్యమైన విత్తనంగా గుర్తించవచ్చు.

కాబట్టి రైతులు ఈ ఖరీఫ్ సీజన్ కు విత్తనాన్ని సేకరించిన తర్వాత పైన చెప్పిన పద్ధతుల్లో ఏదైనా పద్ధతి ద్వారా  మొలక శాతాన్ని గుర్తించవచ్చు. ఎంచుకున్న విత్తన రకం 80 శాతం మొలకను కలిగి ఉంటే అది నారుమడులను తయారు చేసుకోవడానికి అనువైనది. ఈ విధంగా రైతులు విత్తన ఎంపికలో మరియు సేకరణలో మెళ కువలు పాటించినట్లయితే మెరుగైన దిగుబడులను సాధించడానికి వీలవుతుంది.

డా. బి. బాలకృష్ణ, డా. బి. వి.యస్. యన్. కిరణ్  మరియు డా. జి. సురేష్, కె.యల్. వ్యవసాయ కళాశాల, కె. యల్ యూనివర్సిటీ, వడ్డేశ్వరం, గుంటూరు.

Leave Your Comments

CM Chandrababu: మామిడి రైతులు- పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలి

Previous article

Marreddy Srinivasa Reddy: మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం..

Next article

You may also like