ఆంధ్రప్రదేశ్

APCOBకు జాతీయ స్థాయి గౌరవం

0
                               ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (APCOB) మరోసారి రాష్ట్రానికి గౌరవం తెచ్చింది. సహకార రంగంలో ప్రతిభ కనబరిచినందుకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి 3-tier cooperative structure lo రెండవ బహుమతి APCOBకు లభించింది. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో షిమ్లాలో జరిగిన జాతీయ సహకార సదస్సులో ఈ అవార్డు అందజేయబడింది. APCOB చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు ఈ పురస్కారాన్ని IFFCO చైర్మన్ మరియు NCUI అధ్యక్షులు శ్రీ దిలీప్ సాంగానీ చేతులమీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా NAFSCOB చైర్మన్ శ్రీ కొండూరు రవీంద్రరావు, NAFSCOB మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ భీమసుబ్రహ్మణ్యం, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ దేవేందర్ తదితరులు హాజరయ్యారు. APCOB మేనేజింగ్ డైరెక్టర్ డా. ఆర్. శ్రీనాథ్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2015లో రాష్ట్ర విభజన తర్వాత కేవలం రెండు బ్రాంచీలతో, ₹7,967 కోట్ల వ్యాపారంతో నిలిచిపోయిన APCOBకు ఆ దశలో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. స్థిరమైన ప్రధాన కార్యాలయం లేకపోవడం, సీనియర్ అధికారుల కొరత, టెక్నాలజీ పరంగా తెలంగాణపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ క్లిష్టతను అవలీలగా జయించి, కేవలం దశాబ్ద కాలంలోనే బ్యాంక్ అద్భుతమైన ఎదుగుదల సాధించింది. 2020 నాటికి వ్యాపార పరిమాణం ₹15,596 కోట్లు దాటగా, 2025 మార్చి నాటికి అది మరింతగా పెరిగి ₹46,430 కోట్లు చేరింది. ఇందులో ₹11,002 కోట్లు డిపాజిట్లు, ₹35,428 కోట్లు రుణాలు ఉన్నాయి. పదేళ్లలో ఆరు రెట్లు పెరిగిన ఈ వృద్ధి సహకార రంగంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, బ్యాంక్ అమలు చేసిన వ్యూహాలను ప్రతిబింబిస్తుంది.
ఈ అభివృద్ధి వెనుక ప్రధాన బలంగా నిలిచింది టెక్నాలజీ ఆధారిత మార్పులు. అన్ని 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఏకీకృతం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 465 బ్రాంచీలు, ఒకే వేదికపైకి తెచ్చారు. ముఖ్యంగా PACS కంప్యూటరైజేషన్ ప్రాజెక్ట్ ద్వారా APCOB దేశంలోనే సిస్టమ్ ఇంటిగ్రేటర్ పాత్ర పోషించిన మొదటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌గా చరిత్రల్లోకెక్కింది. PACSల్లో 99.7% డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి మార్చి, హార్డ్‌వేర్ కిట్లు, ఆధార్ ఆధారిత KYC, డిజిటల్ పాస్‌బుక్‌లు, POS పరికరాలు అందజేశారు. డాష్‌బోర్డ్ సిస్టమ్ ద్వారా PACS ఆర్థిక లావాదేవీలు, NPAలు, సభ్యత్వ వివరాలు, మౌలిక వసతులు తక్షణమే గమనించగల విధానం ఏర్పడింది.
2020లో ప్రారంభించిన PACS డెవలప్‌మెంట్ సెల్స్ PACS వైవిధ్యీకరణకు మార్గం చూపాయి. వాటి మార్గదర్శకత్వంలో PACSలు ఫెయిర్ ప్రైస్ షాపులు, ఎరువుల దుకాణాలు, పెట్రోల్ బంకులు, జనౌషధి కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 25 పెట్రోల్ బంకులు ప్రారంభమయ్యాయి, మరో ముప్పైకి పైగా ఆమోదం పొందాయి. రైతుల అవసరాలకు అనుగుణంగా 1,005 బహుళ ప్రయోజన గోదాములు నిర్మాణంలోకి వచ్చాయి. వీటిలో 745 పూర్తయ్యి, 245 వినియోగానికి అందుబాటులోకి వచ్చాయి.
గ్రామీణ స్థాయిలో మానవ వనరుల అభివృద్ధి కూడా APCOB ప్రధానంగా తీసుకున్న అంశం. రాష్ట్రంలో తొలిసారిగా PACS HR విధానం అమలు చేసి, 5,500 మందికి పైగా PACS ఉద్యోగులకు ప్రమాణిత నియామక పద్ధతులు, పారదర్శక నియామకాలు, కెరీర్ ప్రోగ్రెషన్ అవకాశాలు కల్పించారు. ఈ చర్యల వల్ల యువతలో సహకార రంగంపై కొత్త విశ్వాసం పెరిగింది.
APCOB రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన ముద్ర వేసింది. Vision Amritkaal అనే భవిష్యత్ వ్యూహ పత్రాన్ని, Perspective Plan 2030 అనే దీర్ఘకాలిక ప్రణాళికను విడుదల చేసి సహకార రంగానికి మార్గదర్శకం చూపింది. ‘స్వర్ణ ఆంధ్ర@2047’ అనే దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యానికి ఇది ప్రతిబింబం. గ్రామీణ సమగ్రాభివృద్ధి పట్ల రాష్ట్రం చూపుతున్న అచంచల నిబద్ధతకు ఇది నిదర్శనం. అదే సమయంలో, డిజిటల్ ఇండియా రూపకల్పనలోని మార్పు లక్ష్యాలతో సైతం ఇది సమన్వయంగా సాగుతోంది. NABARD, NAFSCOB, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ వేదికల్లో రాష్ట్రాన్ని ప్రతినిధ్యం వహిస్తూ సహకార రంగానికి అవసరమైన విధాన పరమైన సవరణలు, పెట్టుబడులు, టెక్నాలజీ మద్దతు కోసం కృషి చేస్తోంది.
ఈ కృషికి గుర్తింపులూ వరుసగా లభిస్తున్నాయి. విభజనకు ముందు ఐదు దశాబ్దాల్లో కేవలం కొన్ని అవార్డులు పొందిన APCOB, గత పదేళ్లలోనే ఆరు ప్రధాన జాతీయ అవార్డులు గెలుచుకుంది. షిమ్లాలో లభించిన ఈ గౌరవం APCOB జాతీయ స్థాయిలో నిలిచిన ప్రాముఖ్యతను మరింత బలపరిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సహకార క్రెడిట్ వ్యవస్థ మార్కెట్ షేర్ కేవలం 5% వద్ద ఉన్నా, దాన్ని 25%కి పెంచడమే APCOB లక్ష్యం. డిజిటల్ బలమైన వేదిక, విభిన్న వ్యాపార వ్యూహాలు, అభివృద్ధి లక్ష్యాలపై నిబద్ధతతో, గ్రామీణ సమాజాలపై మరింతగా ప్రభావం చూపే దిశగా APCOB దూసుకుపోతోంది.
షిమ్లాలో లభించిన ఈ పురస్కారం కేవలం అవార్డు మాత్రమే కాదు, సహకార రంగాన్ని బలోపేతం చేసే శక్తిగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే మార్గదర్శకుడిగా APCOB భవిష్యత్ పయనాన్ని ముద్రిస్తోంది.
Leave Your Comments

15 వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు PJTAU గుర్తింపు పత్రాలు జారీ

Previous article

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సాహకాలు

Next article

You may also like