వార్తలు

తన గ్రామాన్ని దత్తత తీసుకుని సేంద్రియ సేద్యం చేస్తున్న.. యువరైతు తిరుపతి

0

తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారు. సంపద వుంది, బంధు వర్గం వుంది అయినా ఆయనను కాపాడుకోలేకపోయారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆ యువరైతు, తన తండ్రే కాదు అబం శుభం ఎరుగని చిన్నారులు క్యాన్సర్ ,మహమ్మారి బారినపడటం కాళ్లారా చూసిన దృశ్యం అతడికి తీవ్రంగా కలచివేసింది. రసాయనిక సేద్యం, వాటి ద్వారా పండించిన పంట ఉత్పత్తులను తీసుకోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని గుర్తించాడు. ఆ పరిస్థితిని మార్చాలని తనవంతు ప్రయత్నం ప్రారంభించాడు. తానొక్కడితోనే ఆగిపోకుండా తనతో పాటు తోటి రైతులను చైతన్యవంతం చేస్తూ దేశీయ విత్తనాలను సేకరించి సేంద్రియ ఉద్యమం చేస్తున్నాడు సిద్ధిపేట జిల్లాకు చెందిన యువరైతు తిరుపతి. నేటి యువతరంకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వెనుకట మన పూర్వికులు ఎంతటి బలశాలులో అందరికీ తెలిసిందే. కేవలం దంపుడు బియ్యం తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. పొద్దంతా పని చేసినా అలుపన్న మాటే వినిపించేది కాదు. అప్పట్లో ఏ వ్యాధులు లేవు, ఆసుపత్రుల వెంట తిరిగే అవసరము రాలేదు. దీనంతటికి కారణం అప్పటి దేశవాళీ పంటలు, పండించే విధానాలనే అని చెప్పక తప్పదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. ఆరోగ్యాన్ని పంచె ఆహరం అనారోగ్యాన్ని పెంచుతోంది. రసాయనాల ద్వారా పండిన ఆహారాన్ని తిని ఎంతో మంది ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే పరిస్థితి సిద్ధిపేట జిల్లా, చేర్యాల మండలం, నాగపురి గ్రామానికి చెందిన జక్కుల తిరుపతికి ఎదురైంది. తన తండ్రి క్యాన్సర్ బారిన పడి తనువు చాలించడంతో తిరుపతి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అడ్డగోలుగా పురుగు మందులు చల్లి పండించిన ఆహారాన్ని తినడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని గ్రహించాడు. సేద్యంలో మార్పులు తీసుకురావాలని సంకల్పించుకున్నాడు. పట్టణాన్ని వీడి పల్లె బాట పట్టాడు. పురుగు మందులకు చెక్ పెట్టి దేశీయ వరి విత్తనాలను సేకరించి సేంద్రియ విధానంలో ఆదర్శంగా పండిస్తున్నాడు. తోటి రైతులకు, యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేశీయ వరి వంగడాల్లో వున్న ఔషధ విలువలను తెలుసుకుని వాటినే సాగు చేస్తున్నాడు యువరైతు తిరుపతి. నలుపు, ఎరుపు, సుగంధ రకాలతో పాటు దొడ్డు, సన్న వరి రకాలను కలుపుకుని 51 వరి వంగడాలను 10 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు. ఆరోగ్యమే ప్రధాన అంశం మధుమేహం, మోకాళ్ల నొప్పులు, బరువును తగ్గించే రకాలతో పాటు, సంతాన సమస్యలు తీర్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వంగడాలను పండిస్తున్నాడు. తానొక్కడితోనే ఈ ఉద్యమం ఆగిపోకూడదని నిర్ణయించుకున్న తిరుపతి తన గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. సేంద్రియ ఉద్యమం చేస్తున్నాడు. పూర్తిస్థాయిలో గ్రామంలోనే ఉంటూ రైతులకు అందుబాటులో ఉంటున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం సాగు చేయిస్తున్న ఆర్ ఎన్ ఆర్ 15048 లో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 శాతం ఉంటే ఈ నల్ల వరిలో 41 శాతం ఉంటుందని రైతు తిరుపతి చెబుతున్నాడు. ఈ నల్ల వరితో గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఊబకాయం, షుగర్ వంటి వ్యాధులు నయం అవుతాయని తిరుపతి చెబుతున్నాడు. వరి నాటు వేసుకోవాలా.. వేదం జిల్లాల.. పొడిదుక్కిలో విత్తనాలు పెట్టుకోవాలా.. లేదా డ్రప్ సీడర్ తో విత్తనాలు నాటుకోవాలా… అన్నది చాలా మంది రైతుల్లో మొదలయ్యే ప్రశ్న. అయితే పూర్వం 100 ఏళ్ల క్రితం వెదజల్లే విధానంలోనే వరిసాగు చేసేవారు రైతులు. కానీ ఈ విధానం ద్వారా విత్తనాలను చల్లడం వల్ల కలుపు సమస్య రైతును తీవ్రంగా వేధిస్తుంటుంది. నాట్లు వేసుకోవాలంటే కూలీల సమస్య ఎదురవుతుంది. ఇక పొడి దుక్కిలోనే విత్తనాలు చల్లుకోవడం వల్ల కలుపు విసృతంగా పెరుగుతుంది. సేంద్రియ సేద్యంలో ఈ విధానం కుదరదు. కాబట్టి రైతులు డ్రమ్ సీడర్ విధానంలో వరి విత్తనాలు నాటుకోవాలని రైతు తిరుపతి సూచిస్తున్నాడు. ఈ విధానంలో కలుపు సమస్య తీరడంతో పాటు కూలీల అవసరం ఉండదని, అదే విధంగా దిగుబడి ఆశాజనకంగా వస్తుందని వెల్లడిస్తున్నారు.
వరి పెరిగే దశలో ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం, మట్టి ద్రావణాలు, జీవన ఎరువులను వేసుకోవాలి. దేశవాళీ ఆవు పేడతో తయారు చేసిన ఎరువుతో చేను బలంగా తయారవుతుంది. చీడపీడల నివారణకు వేప కాషాయాలు. చీడపీడలను గుర్తించిన వెంటనే పైరుకు అందించాలి. వరికి ఎక్కువ నీరు అవసరం అనేది ఒక అపోహ మాత్రమే. మామూలు మొక్కలతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అంతే కానీ అవసరం ఉన్నదానికంటే అధికంగా నీరందిస్తున్నారు చాలా మంది రైతులు. అలా చేయడం వల్ల వరిలో పిలకలు శాతం తగ్గుతుంది. నీటిని ఆరుతడిగానే అందించాలని రైతు చెబుతున్నాడు. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తిని తీసుకోవచ్చని సూచన.
నలుపు రంగు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని వారి కోసమే ప్రత్యేకమైన రకాలను సాగు చేస్తున్నాడు తిరుపతి. కుజిపటాలి, చింతలూరి సన్నాలు అనే రకాలను పండిస్తున్నాడు. ఈ రకం బియ్యం చాలా రుచిగా ఉంటాయి. ఏ వయస్సు వారు తిన్నా అరుగుదల బాగుంటుందని రైతు చెబుతున్నాడు. నేలను తట్టుకుంటాయి. పంట పడిపోదు. తెగుళ్లు తక్కువగా వస్తాయి. దిగుబడి ఆశాజనంగా లభిస్తుంది. ఎంతలేదన్నా ఎకరాకు 20 నుంచి 30 బస్తాల వరకు ధాన్యం మొదటి సంవత్సరంలోనే చేతికి అందుతుందని రైతు చెబుతున్నాడు. అదే విధంగా ప్రభుత్వ మార్కెట్ లపై ఆధారపడకుండా తిరుపతి తానే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నాడు. వివిధ కార్యక్రమాలు, సదస్సులు, విందులు, వినోదాల్లో తాను పండిస్తున్న బియ్యం రుచిని ప్రజలకు పరిచయం చేసి ప్రచారం చేస్తున్నాడు. తద్వారా వినియోగదారులను తనవైపుకు తిప్పుకుంటున్నాడు. ఇదే తన మార్కెట్ మంత్రం అని తెలిపాడు తిరుపతి.
సంకల్పం బాగుంది.. సమిష్టి కృషి సాగుతోంది. నాగపురి గ్రామంలోని రైతులు తిరుపతి సాగు తీరుతెన్నులు తెలుసుకుంటున్నారు. సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. రైతులే కాదు గ్రామ సర్పంచి, ఎంపీపీ, ఎంపీటీసీ లతో పాటు ప్రభుత్వ అధికారులు తిరుపతి సూచించిన సాగు విధానాలను అనుసరిస్తున్నారు. ఓ ఉద్యమంగా సేంద్రియ సేద్యాన్ని ముందుకు తీసుకుళ్తున్నాడు. ఈ క్రమంలో రైతులను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు యువరైతు. నిజమైన దేశభక్తిని చాటుకోవాలంటే ప్రతీ ఒక్కరు రైతుల వద్దే నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిస్తున్నాడు.

Leave Your Comments

చిన్న రైతులకు గ్రీన్ హౌస్ లను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ఖేతి..

Previous article

నల్ల ద్రాక్ష వలన కలిగే మేలు..

Next article

You may also like