PJTSAU Released High Yielding Varieties: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ సలహామండలి రెండవ సమావేశం ఈరోజు వర్సిటీ ఆడిటోరియంలో ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ K.హనుమంతు, పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల సమన్వయకర్తలు, రైతులు, విత్తన సంస్థల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. వర్సిటీ ఏర్పాటై నప్పటి నుండి వివిధ పంటలకి చెందిన 54 కొత్త వంగడాల్ని విడుదల చేసినట్లు జగదీశ్వర్ తెలిపారు. స్వల్పకాలిక రకాలకి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. అధిక సాంద్రత పత్తి సాగు పై రెండేళ్ల నుంచి పరిశోధనలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

PJTSAU Released High Yielding Varieties
అయితే మారిన పరిస్థితుల్లో పశుగ్రాస కొరత ఏర్పడుతుందని దానిపై దృష్టి పెట్టవలసిన అవసరముందని అన్నారు. వేరుశనగ విషయంలో ఇంకా పరిశోధనలు జరగాల్సివుందని జగదీశ్వర్ అభిప్రాయపడ్డారు. విస్తరణ విషయంలో వర్సిటీ చాలా ముందంజలో ఉందని సుధారాణి వివరించారు. వర్సిటీ యూట్యూబ్ ఛానల్ కి సుమారు 50 లక్షల మందికి పైగా వీక్షకులున్నారని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉండడంతోపాటు యువతకి ఉపాధి కల్పించినట్లవుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. కొత్త టెక్నాలజీలను తమకి అందుబాటులోకి తీసుకువస్తే కూలీల సమస్య తీరుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు అమలు చేస్తోందని హనుమంతు అన్నారు. వాతావరణ మార్పులు, వర్షాలు, వరదల వల్ల రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదన్నారు. అందుకు తగిన ప్రత్యామ్నాయ ప్రణాళికలు వర్సిటీ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. దానికి దానికి అనుగుణంగా పంటల సరళిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు.
అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఆర్థికాంశాల్లోనూ రైతులకి అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా సంస్థలు రైతులతో మమేకం కావాలని అందుకు రైతు వేదికల్ని ఉపయోగించుకోవాలని హనుమంతు సూచించారు. భవిష్యత్తులో వ్యవసాయం మరిన్ని సవాళ్లను ఎదుర్కొనున్నదని ప్రవీణ్ రావు అన్నారు. పరిమిత వనరుల్లో విసృత వ్యవసాయం చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.

PJTSAU Released 54 High Yielding Varieties
వినియోగదారులు, రైతులు, ప్రభుత్వ విధానాలకి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు ఉండాలన్నారు. వాతావరణ మార్పులు, కొత్త కొత్త టెక్నాలజీలు, మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలు మారాలన్నారు. పరిశోధనల ధోరణులు మారాలని ప్రవీణ్ రావు అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా నూతన సవాళ్లకి ధీటుగా నిలవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నీటి వనరుల్ని కల్పిస్తుందన్నారు. ఈ సమయంలో నీటి సమర్ధ యాజమాన్య పద్ధతులపై రైతాంగానికి అవగాహన కల్పించాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ విధానం కూడా అమల్లోకి రావాల్సి ఉందని ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు.
వర్టీకల్ ఫార్మింగ్, డిజిటలికరణ, హైడ్రోపోనిక్స్ వంటి నూతన విధానాలు మరింత విస్తృతం అవుతాయని ప్రవీణ్ రావు అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇతర సంస్థలు పూర్తి సమన్వయంతో పనిచేసి రైతాంగ సంక్షేమానికి కృషి చేయవలసివుoదన్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం సహా అందరి తోడ్పాటుతో PJTSAU ని అగ్రస్థానానికి తీసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేశానని ప్రవీణ్ రావు వివరించారు.ఈ సందర్భంగా వర్సిటీ రూపొందించిన వివిధ ప్రచురణలను విడుదల చేశారు. తదనంతరం రాజేంద్రనగర్ లో నిర్మించిన కొత్త అకాడమిక్ బ్లాక్ ని ప్రవీణ్ రావు ప్రారంభించారు.
Also Read: Soil Testing: భూసార పరీక్ష గురించి సందేహాలు- సలహాలు.!