ఆంధ్రప్రదేశ్ఉద్యానశోభవ్యవసాయ పంటలు

ఆకర్షణీయమైన ఆంతురియం పూల సాగులో మెళకువలు

0

వాణిజ్యపరంగా ప్రపంచంలో 10 ముఖ్యమైన కట్ ఫ్లవర్ల లో ఆంతురియం ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇవి సతత హరిత, ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా సాగుకు అనుకూలంగా ఉన్న మొక్కలు. తక్కువ ఉష్ణోగ్రతలు మరియు వాతావరణం లో ఎక్కువ తేమ కల్గిన అనుకూల వాతావరణంలో నెట్ హౌస్ లేదా హరితగృహం సదుపాయం తో ఏడాది  పొడవున పూలసాగు చేయవచ్చు. ఆంతురియం పుష్పాలను ముఖ్యంగా బోకేల తయారీలో పుష్పాల అలంకరణలో మరియు స్టేజ్ డెకరేషన్ లో విరివిగా ఉపయోగిస్తారు. ఆంతురియం పుష్పాలు దూరప్రాంతాల ఎగుమతిని సహితం తట్టుకొని, తాజాగా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఒకసారి మొక్కలు నాటుకొంటే 8 నుంచి 10 సంవత్సరాల వరకు నాణ్యమైన పుష్పాలు పొందవచ్చు. ఆంతురియం పుష్పాలు ముఖ్యంగా మూడు రకాలు, అవి,

స్టాండర్డ్ ఆంతురియం పుష్పాలు: ఇవి సాధారణంగా హృదయాకారం లో ఉండి, వీటి స్పేత్ వివిధ రంగులలో ఉంటాయి. వాణిజ్యపరంగా ఇవి అధికంగా సాగులో ఉన్నాయి.

ఒబేక్ ఆంతురియం పుష్పాలు :

వీటి స్పేత్ రెండు రంగుల సమ్మేళనంగా ఉంటుంది. ముఖ్యంగా ఆకుపచ్చ-గులాబీ రంగు మరియు ఆకుపచ్చ- ఎరుపు రంగులలో ఉంటాయి.

తులిప్ ఆంతురియం పుష్పాలు :

వీటి స్పేత్ గిన్నె ఆకారంలో లేదా తులిప్ పుష్పాల ఆకారంలో ఉండి వివిధ రంగులలో లభిస్తాయి.

మొక్కలు పెంచు మాధ్యమం:

ఆంతురియం మొక్కలు వివిధ రకాల సేంద్రీయ  పదార్థాలైన మొదలగు వాటిపై ఆధారపడి జీవిస్తాయి. ముఖ్యంగా ఇవి పెరుగుటకు సేంద్రీయ మాధ్యమం బాగా తేమను పట్టించి, నీరు నిలవకుండా, వదులుగా గాలి ప్రసరణ  బాగా వుండే లక్షణాలు కలిగిన మరియు తక్కువ లవణ సాంద్రత కలిగి ఉండాలి. సాధారణంగా కొబ్బరి పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధ  పదార్థాలైన కొబ్బరి పీచు, కొబ్బరి డొప్పలు, కొబ్బరి పొట్టు, కలప పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్ధ  పదార్థాలైన రంపపు పొట్టు మరియు వేరుశనగ తవుడు, కొబ్బరి పీచు తో పాటు బొగ్గు మరియు ఇటుక మిశ్రమం కూడా ఉపయోగిస్తారు.  ముందుగా ఎంచుకున్న మాధ్యమాన్ని కాల్షియం కార్బోనేట్ 5 కేజీలు/100 లీటర్ నీటిలో 48 గంటలు నానబెట్టుకోవాలి. దీనివలన అధిక గాడత గల హానికర లవణాలు తొలగిపోతాయి. ఉపయోగించు మాధ్యమం ఉదజని సూచిక  5.0 మరియు లవణ  సాంద్రత  0.6 mhos.cm2 ఉండేలా చూసుకోవాలి.

బెడ్ల తయారీ :

మందమైన పాలిథీన్ ట్రఫ్ లను ఆంతురియం మొక్కలను పెంచే బెడ్లు గా ఉపయోగించుకోవచ్చు. 1 మీటరు వెడల్పు మరియు 10 మీటర్లు పొడవుతో హరితగ్రుహం కొలతను బట్టి నిర్ణయించుకోవచ్చు. రెండు బెడ్ల మద్య 2 అడుగుల నడక దారి వదులుకోవాలి.

ప్రవర్ధనం :

ముఖ్యంగా కణజాల వర్ధనం చేసిన 7 నుంచి 9 నెలల వయసు గల ఆంతురియం మొక్కలను ఎంచుకోవాలి. ఎందుకంటే ఇవి ఒకేవయసు కలిగి వ్యాదుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి. సాధారణంగా  15 -17 నెలల వయసు గల  ఆంతురియం మొక్కలు  పిలక మొక్కలను ఉత్పత్తి చేయడం మొదలవుతుంది. వీటిని తల్లి మొక్క నుంచి వేరు జాగ్రత్తగా వేరుచేసి కొత్త మొక్కలు గా నాటుకోవచ్చు. కాని ఈ పద్దతి ద్వారా వ్యాధులు తల్లి మొక్కనుంచి పిల్ల మొక్కకు వ్యాప్తి చెందే అవకాసం ఉంది.

బెడ్లలో నాటుకొను విధానం: 

పాలిథీన్ ట్రఫ్ లలో ఎంచుకున్న మాధ్యమాన్ని 3/4 వంతు నింపుకోవాలి. మొక్కల మద్య దూరం 45 లేదా 30 సెం.మీ. వుండేలా చూసుకోవాలి. నాటే ముందు మొక్కలను పెంచు మాద్యమం తడిగా ఉండేలా చూసుకోవాలి. ఆంతురియం మొక్కలు నాటే ముందుగా శిలీ0ద్ర నాశిని 0.1% బావిస్టిన్ ద్రావణంలో మొక్క వేర్లను ముంచి తర్వాత నాటుకోవాలి. ఇలా చేయడం వలన వేరు కుళ్ళు తెగులు  రాకుండా జాగ్రత్త పడవచ్చు.

నీటి యాజమాన్యం:

వాతావరణ పరిస్థితులను బట్టి 2 లీటర్ల నీటిని/మీ. 2 అందించాలి. బిందు మరియు తుంపర సేద్యం ద్వారా నీళ్ళను ఇవ్వాలి.

అనుకూల వాతావరణ పరిస్థితులు :

రోజువారీ ఉష్ణోగ్రత, సూర్యకాంతి, వాతావరణంలోని తేమ ఆంతురియం మొక్క పెరుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 18 డి. సెం., సాఖీయ వృద్దికి అనుకూలంగా ఉంటాయి. కానీ రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డి. సెం. ఉష్ణోగ్రత మొగ్గలు ఉత్పత్తి అవడానికి అనుకూలంగా ఉంటాయి. ఆంతురియం మొక్కలు నీడ పట్టున పెరిగే మొక్కలు కావున వీటికి తక్కువ సూర్యకాంతి అవసరం. సూర్యకాంతిని యాజమాన్యం చేయుటకు వివిధ రకాల తెరలను వాడవచ్చు. మార్కెట్లలో 75%, 80%  షేడ్ నెట్స్ (తెరలు) దొరుకుతాయి, వీటిని ఉపయోగించి సూర్యకాంతిని తగ్గించవచ్చు.

ఎరువుల యాజమాన్యం:

ఆంతురియం మొక్కలకు తక్కువ పరిమాణం లో తరచూ పోషకాలను అందించాలి. 2 శాతం 19:19:19 నత్రజని, భాస్వరం, పొటాషియం వారానికి ఒకసారి మొక్కలపై పిచికారి చేస్కోవాలి. స్పెత్ మీద  కాల్షియం మూలక లోపాలు కన్పించినట్లయితే  5 గ్రా. కాల్షియం నైట్రేట్ నెలకు ఒకసారి పిచికారి చేస్కోవాలి.

దిగుబడి:

మొక్కలు నాటిన మొదటి రెండు సంవత్సరాలలో ఒక్కో మొక్క 5-7 పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి. మూడో సంవత్సరం నుంచి ప్రతి మొక్కకు 10-12 పుష్పాలు వస్తాయి.

కోత :

మొక్కలు నాటిన 6 నుంచి 7 నెలల నుండి పుష్పించడం ప్రారంభం అవుతుంది. స్టాండర్డ్ ఆంతురియం పుష్పాల స్పెత్ మొత్తం తెరచుకొని, స్పాడిక్స్ 3/4 వ వంతు పసుపు రంగుకు మారిన పుష్పాలను కోసుకోవాలి. కోసిన వెంటనే కాడలను చల్లని నీటిలో ఉంచాలి. తర్వాత పుష్పాల జీవితకాలం పెంచుటకు పుష్పాల కాడలను మొక్కల వృద్ది కారకాలైన బెంజైల్  అడినైన్, బాక్టిరియ  నాశిని అయిన హై డ్రోక్సి క్వినైన్ లేదా సిల్వర్ నైట్రేట్ లలో ముంచుకోవాలి. ఇలా చేయడం వలన ఆంతురియం పుష్పాల జీవితకాలం 2 నుంచి 3 వారాలకు పెంచవచ్చు. కోసిన పుష్పాలను దూరప్రాంతాలకు తరలించుటకు ఆంతురియం పుష్పాల స్పెత్ లకు పాలిథీన్ సంచులను తొడిగి, కాండం  చివర తడి దూదిని ఉంచి పాలిథీన్ తో కట్టేయాలి. పుష్పాలను కార్డ్ బోర్డ్ పెట్టెలలో (పెట్టె సైజు  24” X 12” X 9”) 70 నుంచి 100 అమర్చాలి. కోసిన పుష్పాలను శీతల గిడ్డంగిలో  13 డి. సెం. ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు 2 నుంచి 3 వరాల వరకు తాజాగా వాడిపోకుండా ఉంటాయి.

సాధారణంగా ఆంతురియం మొక్కలకు వచ్చే తెగుళ్ళు :

మొక్క లేత వయసులో వచ్చే వేరుకుళ్ళు తెగులు :

వేరుకుళ్ళు తెగులును అరికట్టడానికి డైథెన్ ఎం -45 (0.2%) ద్రావణం తో మొక్కల మొదళ్లు  తడిచేలాగా పోసుకోవాలి.

బాక్టీరియా ఎండు తెగులు:

బాక్టీరియా  ఎండు తెగులును అరికట్టడానికి స్ట్రెప్టోసైక్లిన్ (0.01%) ద్రావణం ను మొక్కలపై పిచికారి చేసుకోవాలి లేదా పసుపు + బేకింగ్ సోడా ద్రావణంను కూడా బాక్టీరియా ఎండు తెగులును నివారించడానికి ఉపయోగించవచ్చు.

డా. పి. నీలిమ, డా. కె. జి. కె. మూర్తి,  డి. స్రవంతి, డా. జి. ప్రియదర్శిని, డా. పి. శ్రీ లత,  డా. ఎం. మాధవి, అగ్రికల్చరల్ కాలేజీ, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం డా. టి. సుమతి, శ్రీ కృష్ణదేవరాయ కాలేజీ అఫ్ హార్టికల్చర్, అనంతపురం, ఫోన్ : 81849 29874

 

Leave Your Comments

పాడి పంటల పెంపకానికి – కొత్త తరం రైతు రావాలి

Previous article

ఉద్యాన పంటల ఉత్పత్తికి మల్చింగ్ ఒక వరం

Next article

You may also like