తెలంగాణ రాష్ట్రంలో అపరాల పంటలలో కంది ప్రధానమైనది. ఈ సంవత్సరం (2025-26) కందిని దాదాపు 5 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు కంది పంటను జూన్ మాసంలో విత్తిన పంట కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. కావున రైతులు ఇప్పటినుండి తక్కువ దశను గుర్తించి సకాలంలో పంట కోత కోసి, కోత అనంతరం మరియు నిల్వ సమయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే నాణ్యమైన గింజ దిగుబడి తద్వారా అధిక నికరదాయాన్ని పొందవచ్చు.
పంటకోత :- కందిలో మధ్య కాలిక రకాలు, మధ్య స్వల్ప కార్యకర్తలు ఉంటాయి. ఇలా రకాలను బట్టి పూత దశ నుంచి 45-60 రోజుల్లో పంట పరిపక్వతకు వస్తుంది.
కోతకు 3-4 రోజుల ముందు ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా. లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినచో నిల్వలో పెంకు పురుగు ఆశించకుండా కాపాడవచ్చు.
80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోయాలి.
పంటను కొడవలితో మొక్క మొదలు వరకు కోయాలి. లేదా బాగా పరిపక్వత చెందనిచ్చి కొంతమేర ఆకులు రాలిన తర్వాత యంత్రం సహయంతో అనగా “కంబైన్డ్ హర్వెస్టర్ ను” ఉపమోగించి పంటను కోయవచ్చును.
కంది పంటను కంబైన్డ్ హర్వెస్టెర్ తో కోయడం వల్ల ఒకే సారి పంటకోత (56 ఎకరాలు) జరిగి గింజలను సేకరించుకోవచ్చు, నూర్పిడి చేసే అవసరం కూడా ఉండదు.
హర్వెస్టర్ బ్లేడ్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. బ్లేడ్స్ సరిగా పని చేయని ఎడల కంది కొమ్మలను వాటికి ఉండే కాయలను వదిలి వేయడం జరుగుతుంది కాబట్టి సరిగా చూసుకోవాలి.
పశువులతో తొక్కించి లేదా ట్రాక్చర్లలో తొక్కించి నూర్పిడి చేసుకోవాలి.
మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టడం లేదా చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు.
యంత్రం సహాయంతో (ఆల్ క్రాప్ త్రెషర్) నేరుగా కంది కట్టలను యంత్రంలో జోప్పించి నూర్పిడి చేయవచ్చు.
నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త, ఎండిన ఆకులు మట్టి మొదలగునవి లేకుండా చేసి 3-4 రోజులు వరకు ఎండబెట్టాలి.
గింజలలో 9-10 శాతం తేమ ఉండేటట్లుగా చూసుకోని నిల్వ చేయాలి.
నిల్వ చేయు సమయంలో జాగ్రత్తలు: కంది గింజలను బిన్స్ గాని లేదా గోనె సంచులలో గాని లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగులలో గాని నిల్వ చేయవచ్చు.
బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన, క్రింద 20 మి.లీ. మలాథియాన్ 50% ఇ.సి- ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కంది గింజలు నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి.
గృహ అవసరాలకై నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంటనూనె 50 మి.లీ. కిలో గింజిలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతిని తగ్గించవచ్చును.
డా. యం. మధు, డా. ఎ. వెంకట్ రెడ్డి, డా. పి. గోన్యా నాయక్, డా. జి. పద్మజ మరియు డా. ఆర్. ఉమా రెడ్డి.ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్, ఫోన్ : 99125 22394


























