తెల్ల బంగారంగా పిలువబడే పత్తి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమున్న వాణిజ్య పంటలలో ఒకటి. పత్తి దిగుబడులను ప్రభావితం చేసే అనేక కారణాలలో పోషకాల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గత అర్ధశతాబ్దం నుంచి వస్తున్న పరిణామాలను ఒకసారి పరిశీలించినప్పుడు పోషకాల యాజమాన్యంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. రసాయన ఎరువుల వినియోగం విస్తృతంగా పెరిగినప్పటికీ, సహజసిద్ధమైన సేంద్రియ ఎరువుల వాడకం తగ్గుతూ వస్తుంది. దీని పర్యవసానంగా నేల స్వాభావిక గుణం క్షీణించి, పంటల్లో తక్కువ మోతాదులో అవసరమయ్యే ద్వితీయ మరియు సూక్ష్మ పోషక లోపాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రత్తి సాగులో మెగ్నీషియం, జింకు, బోరాన్ వంటి ధాతు పోషకాల లోపాలు గణనీయంగా గుర్తించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, పత్తిలో మెగ్నీషియం, జింకు మరియు బోరాన్ లోప లక్షణాలను గుర్తించటం, వాటికి అనుగుణమైన సవరణ చర్యలను చేపట్టటం ద్వారా మాత్రమే స్థిరమైన దిగుబడులను పొందగలము.
మెగ్నీషియం :
ముదురు ఆకుల అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారి ఆకుల ఈనెలు మాత్రం పచ్చగా వుంటాయి. లోప తీవ్రత పెరిగినప్పుడు ఆకులు ఎర్రబారి ఎండిపోయి రాలిపోతాయి. సాధారణంగా ఈ లోపం పొటాషియం ఎక్కువగా ఉన్న నేలల్లో కనిపిస్తుంది. మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ను పంట విత్తిన 45 మరియు 75 రోజుల తరువాత 7-10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
జింకు :
జింకు లోపం ఎక్కువగా ఒకే పొలంలో పంట మార్పిడి లేకుండా పత్తిని అనేక సంవత్సరాలుగా పండించటం, భాస్వరం ఎరువులు ఎక్కువగా వేయడం, చౌడు భూములు, మట్టిలో సహజంగా జింకు తక్కువగా ఉండడం వలన వస్తుంది. ఈ ధాతు లోపం, మొక్కలో లేత మరియు మధ్య వయస్సు ఆకుల మీద కనిపిస్తుంది. ఆకుల ఈనెలు ఆకుపచ్చగా వుండి, ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపుపచ్చగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా వుండి ముడతలు పడి, కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. జింకు లోపం వున్న నేలల్లో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి లేదా జింకు సల్ఫేట్ 2 గ్రా./లీ. నీటికి కలిపిన ద్రావణాన్ని మొక్కల మీద లోప లక్షణాలు గమనించినప్పుడు 7-10 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారి చేయటం ద్వారా లోపాన్ని సవరించుకోవచ్చు.
బోరాన్ :
ఈ సూక్ష్మ ధాతు లోపమున్నప్పుడు ఆకర్షక పత్రాలు లోపలకు కుచించుకుని ముడుచుకుపోయి పూల ఆకారం మారుతుంది. ఆకుల కాడలు ఒకే రీతిన వుండక కొంత లావుగాను, కొంత సన్నగాను వుండి ఆక్కడక్కడ నల్లటి వలయాలు ఏర్పడటంతో పాటు, ఆకుల మీద రాగి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లోపం బాగా ఎక్కువగా వున్నప్పుడు పూత గూడ దశలో ఎండిపోవడం, చిన్న కాయలు రాలిపోవడంతో పాటు, మొక్కలు గిడసబారి ప్రధాన కాండంపై పగుళ్ళు కూడా ఏర్పడతాయి. కాయలు సరిగ్గా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోతాయి. ఒక్కోసారి పెరిగే దశలో కాయలపై నిలువుగా పగుళ్ళు ఏర్పడతాయి. సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లోనూ, వర్షాభావం మరియు అధిక వర్షపాతం ఉన్న పరిస్థితులలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 60 మరియు 90 రోజుల తరువాత లీటరు నీటికి 1-1.5 గ్రా. బోరాక్స్ ద్రావణాన్ని (సోడియం టెట్రాబోరేట్) వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
- ప్రత్తిలో మెగ్నీషియం పోషకం లోప లక్షణాలు
- పత్తిలో జింకు పోషకం లోప లక్షణాలు
- పత్తిలో బోరాన్ పోషకం లోప లక్షణాలు
డా. కె. కిరణ్ కుమార్ రెడ్డి, సేధ్య విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరుడా. బికె కిషోర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం, అనంతపురము డా. మల్లేశ్వరి సాధినేని, ఆచార్యా ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఫోన్ : 9493344440


























