ఆంధ్రప్రదేశ్తెలంగాణవ్యవసాయ పంటలు

కొబ్బరిలో నర్సరీ పద్ధతులు మరియు నిర్వహణ

0

కొబ్బరి అనేది దీర్ఘకాల శాశ్వత పంట అందువల్ల, కొబ్బరి నాటడంలో అధిక జన్యు నాణ్యత కలిగిన మొక్కల ఎంపిక మరియు వాటి ఉపయోగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. భవిష్యత్ దిగుబడిని నిర్ణయించడంలో మొక్క యొక్క నాణ్యత మరియు శ్రేష్ఠత మీద ఆధార పడి ఉంది. కొబ్బరి సమగ్ర సాగు మరియు అధిక దిగుబడి కోసం నాణ్యమైన మొక్కల సేకరణ మరియు ఎంపిక చాలా ముఖ్యం. నాణ్యమైన మొక్కల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం కొబ్బరి పరిశ్రమ సుస్థిరమైన అభివృద్ధికి ఆటంకంగా మారింది. వ్యాధి రహిత, నిజమైన జన్యు రకానికి చెందిన నాణ్యమైన మొక్కలు భారీ మొత్తంలో సరఫరా చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది మరియు సరైన సమయంలో ఈ సవాళ్లని పరిష్కరించాలి. కొబ్బరి వంటి పరాగసంపర్క పంటలో విత్తన నాణ్యత తల్లి తోట లక్షణాలతో చాలా సంబంధం కలిగి ఉంటుంది, అందువల్ల నాణ్యమైన మొక్కల ఉత్పత్తికి తల్లి చెట్ల ఎంపిక మరియు మంచి విత్తన సేకరణ చాలా ముఖ్యమైనది.

కొబ్బరి విత్తనాల  సేకరణ మరియు ఎంపిక :-

కాలాన్ని అనుసరించి విత్తన సేకరణ సమయం ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటుంది. వర్షాకాలంలో కాసిన కాయలను సేకరించడం ఉత్తమం. కొబ్బరి కాయల కోతకు సరైన సమయం చాలావరకు ఆ ప్రాంతంలోని కాలానుగుణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. జనవరి నుండి మే వరకు పశ్చిమ తీరంలో ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ సమయంలో కోత కోసిన కాయలు సాధారణంగా ఇతర నెలలలో కోసిన కాయల కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి మరియు కాయ లోపల కొబ్బరి శాతం ఎక్కువగా ఉంటుంది మరియు గరిష్ట అంకురోత్పత్తిని ఇస్తాయి. నైరుతి రుతుపవనాల ప్రారంభం నుండి జులై వరకు నర్సరీలో విత్తనాలను నాటవచ్చు, తూర్పు తీర ప్రాంతంలో అక్టోబర్-నవంబర్‌లలో విత్తనాలను విత్తుకోవచ్చు.

కాయలు పూర్తిగా పరిణతి చెందినవి, అనగా దాదాపు పదకొండు నుండి పన్నెండు నెలల వయస్సు కలిగి ఉండాలి. పరిపక్వ కాయలు చేతి వేళ్ళతో కొట్టినప్పుడు స్పష్టమైన లోహ ధ్వనిని ఉత్పత్తి చేయాలి, దీనిని అనుభవం ద్వారా గుర్తించవచ్చు. పరిపక్వం చెందని కాయలు సాదారణ ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి వాటిని తిరస్కరించాలి. కాయలను కదిలించడం ద్వారా నీరు ఉందా లేదా అనేది గుర్తించి నీరు ఉన్న కాయలను విత్తనంగా ఎంపిక చేయాలి. పూర్తిగా పరిపక్వమైన కాయలు లోపలి ఫైబర్ స్పష్టమైన గోధుమ రంగుతో పొడి పొట్టును కలిగి ఉంటుంది.

కొబ్బరి విత్తనాల నిల్వ :-

కొబ్బరి కోసిన తర్వాత కాయలను వెంటనే నర్సరీలో నాటకూడదు. సాధారణంగా విత్తనాలను నీడలో ఒక నెల  నుండి రెండు నెలల వరకు నిల్వ చేయాలి, తద్వారా పొట్టు ఎండిపోతుంది, తద్వారా వేగంగా మరియు గరిష్టంగా అంకురోత్పత్తి జరుగుతుంది. సాధారణంగా పొడవైన రకాల కాయలను కోసిన రెండు నెలల వరకు నిల్వ చేయాలి మరియు పొట్టి రకాల కాయలను 20-25 రోజుల లోపు  విత్తుతారు. నిల్వ చేయడానికి, విత్తనాలను ఒక షెడ్‌లో 8 సెం.మీ పొర ఇసుకతో అమార్చాలి మరియు కాయలో నీరు ఎండిపోకుండా ఉండటానికి కొబ్బరి ఆకులతో కప్పాలి. విత్తనాలను ఒకదానిపై ఒకటి ఐదు పొరల వరకు అమర్చవచ్చు.

కొబ్బరి విత్తన శుద్ది :-

విత్తనాలు నాటేటప్పుడు, విత్తనాలను ఒక్కొక్కటిగా పరిశీలించి, నిల్వ సమయంలో విత్తన కాయల నీరు ఎండిపోయిన లేదా కుళ్ళిపోయిన విత్తనాలను తొలగించాలి. నేల పొడిగా ఉండి, వర్షాలు ఆలస్యం అయితే, నాటడానికి ముందు విత్తనాలను నీటిలో నానబెట్టడం ఉత్తమం. విత్తనాలను 15 రోజుల వరకి నీటిలో నానపెట్టడం వల్ల వేగంగా మరియు మెరుగ్గా అంకురోత్పత్తి జరుగుతుంది. విత్తనాలు ఆరుబయట  ఎక్కువ కాలం నిల్వ ఉంటే, మొక్కల అంకురోత్పత్తి మరియు నాణ్యత తగ్గిపోతుంది.

విత్తనం నాటే సమయం :-

నర్సరీలో విత్తనాలు నాటడానికి సరైన సమయం వర్షాకాలం ఆధారంగా ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతుంది. వర్షాకాలం ప్రారంభంలో నాటడం ద్వారా మంచి అంకురోత్పత్తికి అవసరమైన భారీ మరియు తరచుగా నీరు పెట్టడాన్ని నివారించవచ్చు. అయితే, పశ్చిమ తీర ప్రాంతంలో, జనవరి నుండి ఏప్రిల్ వరకు సేకరించిన విత్తనాలను మే నుండి జూన్ మాసం వరకు నర్సరీలో విత్తుకోవచ్చు, తూర్పు తీర ప్రాంతంలో అక్టోబర్-నవంబర్‌ మాసం లో  విత్తనాలను విత్తుతారు.

విత్తనం నాటే విధానం :-

దుక్కి దున్నిన తర్వాత నేలను సమానంగా చేసి ఐదు వరుసలు వచ్చేలా ఒక బెడ్ ను తయారు చేయాలి తర్వాత, పారా సహాయం తో 20 cm లోతు గల పొడవైన గుంతలు తవ్వాలి. ఒక వరుసలో కనీసం 20 నుండి 25 విత్తనాలు ఉండేలా 30 x 30 సెం.మీ. అంతరం (మధ్య నుండి మధ్య వరకు) దూరంలో ఒక్కొక్క విత్తనం నాటాలి. క్షితిజ సమాంతరంగా  నాటడం ద్వారా ఎక్కువ శాతం జెర్మి-నేషన్ పొందినప్పటికీ, నిలువుగా నాటిన వాటితో పోలిస్తే మొక్కల దిగుబడి లో ఎటువంటి తేడా కనిపించదు. మొక్కలను ఎక్కువ దూరం సరఫర చేయవలసి వచ్చినప్పుడు, విత్తనాలను  నిలువుగా నాటి పెంచడం మంచిది మరియు వాటిని తగిన విధంగా సులభంగా ప్యాక్ చేయవచ్చు. విత్తనాలను 20-25 సెం.మీ. లోతు లో  లోతైన గుంతలలో నాటి కొబ్బరి పీచు పై భాగం కొద్దిగా కనపడేలా విత్తనాలను మట్టితో కప్పాలి. భూమి యొక్క వాలును బట్టి ప్రతి బెడ్‌లో ఐదు వరుసల కాయలను విత్తవచ్చు, ఒక్కో బెడ్డు లో  ఐదు వరుసలలో కలిపి  100 విత్తన కాయలు నాటడం ఉత్తమం. ఒక్కో బెడ్డు కి 80 cm దూరం ఉండేలా చేస్తే నర్సరీ లో అంతర కార్యకలపాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా చేసుకోవచ్చు

 పాలీబ్యాగుల్లో కొబ్బరి మొక్కల పెంపకం :-

మొక్కలను పొలంలో వేసే ముందు మార్పిడి షాక్‌ను నివారించడానికి మొలకలను పాలీబ్యాగ్‌లలో  పెంచవచ్చు. దీని కోసం, మొదటగా కాయలను నర్సరీలో నిలువుగా విత్తుతారు మరియు అవి మొలకెత్తడం ప్రారంభించినప్పుడు, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మొలకెత్తిన కాయలను సేకరించి, 60 సెం.మీ x 45 సెం.మీ కొలతలు కలిగిన 500 గేజ్ ఉన్న పాలీబ్యాగ్‌లలో మట్టి మరియు ఇసుక మిశ్రమంతో నింపి, పాలీ బాగ్ కింది భాగం లో 8-10 రంధ్రాలు చేయాలి. మిశ్రమం 2:1:1 నిష్పత్తిలో మట్టి, ఇసుక మరియు ఎండిన ఆవు పేడ  కలిగి ఉండాలి. మొక్కలను విత్తిన రోజు నుండి 5 నెలల పాటు మొక్కలను సేకరించాలి. ఈ పాలీబ్యాగ్‌లను బ్యాగ్ నుండి బ్యాగ్‌కు 0.50 నుండి 1 మీ దూరంలో ఉంచాలి. పాలీ బ్యాగ్‌ లో పెంచిన మొక్కల ప్రయోజనం ఏమిటంటే, తోటలో నాటేటప్పుడు మార్పిడి షాక్ కు గురి అవ్వకుండా మరియు మొక్కలు మరింత శక్తివంతంగా ఉంటాయి మరియు ముందుగానే పుష్పించడం ప్రారంభిస్తాయి. పాలీబ్యాగ్ మొక్కల లభ్యతను బట్టి నిల్వ చేయవచ్చు మరియు అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో ప్రధాన పొలంలో నాటవచ్చు.

నాణ్యమైన కొబ్బరి మొక్కల ఎంపిక :-

కొబ్బరి నర్సరీ లో అంతర కార్యకలాపాలు :-

  • విత్తనం నాటిన బెడ్ లను మూడు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి .
  • నర్సరీని కలుపు మొక్కలు లేకుండా ఉంచాలి. కొబ్బరి నర్సరీలో కలుపు సమస్యను నివారించడానికి జిలుగు మొక్కలను 2 సార్లు పెంచడం మరియు 6 నెలల్లో ఒకసారి కలుపు తీయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది, ఇలా నర్సరీ లో పెంచిన జిలుగు కొబ్బరి చెట్లకు పచ్చి ఎరువుగా ఉపయోగపడుతుంది.
  • వేసవిలో నర్సరీకి తగిన నీడ కల్పించడానికి సెస్బానియా లేదా ల్యూకేనా మొక్కలను బెడ్ ల పక్కన పెంచాలి. ఎక్కువ నీడ ఉండటం వల్ల మొలక సన్నగా మరియు లావుగా పెరుగుతుంది.
  • నాటిన 6-8 వారాలలో విత్తనాలు మొలకెత్తడం ప్రారంభిస్తాయి మరియు అంకురోత్పత్తి (మొలకలు రావడం) ఆరు నెలల వరకు కొనసాగుతుంది. నాటిన 5 నెలల ముందు మొలకెత్తే మొలకలను ఎంచుకోండి. విత్తిన 5 నెలల తర్వాత మొలకెత్తని విత్తనాలను తొలగించాలి ఎందుకనగా 5 నెలల తర్వాత మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యంగా, బలంగా ఉండవు.
  • తెగుళ్ళు మరియు వ్యాధుల నివారణ కోసం క్రమం తప్పకుండా సర్వే చేయాలి. చెదపురుగులు మరియు వేరు పురుగుల రాకుండా విత్తే సమయం లో క్లోరోపైరిఫాస్ పొడి  చల్లాలి.

సీలోతు రాకేష్, క్షేత్ర అధికారి, కొబ్బరి అభివృద్ది బోర్డు, ఫోన్:8790012858

Leave Your Comments

చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగామహిళలు

Previous article

“మంచి ఆహారం కోసం చేతిలో చేయి వేసి – మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి ముందడుగు”

Next article

You may also like