భారతదేశం మామిడి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి దేశం. మామిడి మన సాంస్కృతిక గుర్తింపులోనూ, ఆర్థిక జీవనోపాధిలోనూ గాఢంగా పాతుకుపోయిన పండు. వేసవికాలంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మామిడితో నిండిన తోటలు ఆశా కిరణాల్లా మెరిసిపోతుంటాయి. అయితే 2024, 2025 మామిడి సీజన్లలో ఆ ఆశే వేదనగా మారింది. సమృద్ధిగా పంట వచ్చినప్పటికీ, చిత్తూరు, కడప, వారణాసి, లక్నో వంటి మార్కెట్లలో మామిడి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని సందర్భాల్లో కిలో రూ 4 నుండి రూ 6 కి మాత్రమే అమ్ముకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఉత్పత్తి ఖర్చు కిలోకి రూ 12 నుండి రూ 15 వరకు ఉండటం వల్ల రైతులకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ఈ ధర పతనంతో రైతులు బలవంతపు అమ్మకాలు చేయాల్సి వచ్చింది. భారీగా పంట వృథా అవ్వటంతో ప్రభుత్వ జోక్యానికి డిమాండ్ పెరిగింది. పలు మీడియా నివేదికలు మరియు రైతు సంఘాలు రైతుల నిస్సహాయతను బయటపెట్టాయి. దీనితో పండిన పండ్లను కోయకుండానే వదిలేయడం, పశువులకు దాణాగా వినియోగించడం లేదా పారేయడం వంటి దృశ్యాలు చూడవలసి వచ్చింది. మరోవైపు, మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయన్న ఆనందానికి విరుద్ధంగా, దేశీయ మార్కెట్లో రైతుల పరిస్థితి మాత్రం ధరల ఊగిసలాటతో పాటు తీవ్ర అస్థిరతను చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే “మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS)”ని కార్యాచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ధరల క్షీణతతో బాధపడే ఉద్యాన (త్వరగా పాడయ్యే) పంటలను పండించే రైతులకు రక్షణగా నిలుస్తుంది.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ను అర్థం చేసుకుందాం….
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (PM-AASHA) యొక్క విస్తృత గొడుగు కింద ఒక ప్రభుత్వ విధాన మద్దతు యంత్రాంగం. కనీస మద్దతు ధర (MSP) ప్రధాన తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలను కవర్ చేస్తుండగా, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రత్యేకంగా కనీస మద్దతు ధర కింద లేని ఉద్యాన పంటలను (మామిడి, టమోటా, ఉల్లిపాయ, బంగాళాదుంప మరియు నిమ్మ) లక్ష్యంగా చేసుకుని, రైతుల జీవనోపాధికి మరియు వారి ఆదాయాలను రక్షించడానికి రూపొందించ బడిన పథకం. మార్కెట్ ధరలు సహేతుకమైన పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ధరలు గత మూడు సంవత్సరాల సగటుతో పోలిస్తే 10 శాతం కంటే ఎక్కువ పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ను అమలులోకి తీసుకురావచ్చు. అయితే, ఈ మద్దతు స్వయంచాలకంగా జరగదు. ధర తగ్గుదల పరిధి, అంచనా వేసిన ఉత్పత్తి మిగులు మరియు సేకరణ మౌలిక సదుపాయాలను చూపుతూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖకు ఒక ప్రతిపాదనను పంపించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎలా పనిచేస్తుంది: కొనుగోలు, సేకరణ మరియు చెల్లింపు విధానం
ఒకసారి స్కీమ్కు ఆమోదం లభించిన తర్వాత మొత్తం ఉత్పత్తి పరిమితిలో గరిష్ఠంగా 25 శాతం వరకు పంటను ముందుగానే నిర్ణయించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని వ్యయాన్ని సాధారణ రాష్ట్రాల్లో కేంద్రం మరియు రాష్ట్రం 50:50 నిష్పత్తిలో మరియు ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్రాల్లో 75:25 నిష్పత్తిలో పంచుకుంటాయి. సవరించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం (2023–24 నుండి) పథకం అమలుకు రెండు నమూనాలు ఉన్నాయి.
- భౌతిక కొనుగోలు మరియు సేకరణ: నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) వంటి కేంద్ర సంస్థలు మరియు రాష్ట్ర స్థాయి కొనుగోలు సంస్థలు రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసి సేకరించిన పంటను రవాణా మరియు పంపిణీ బాధ్యతను నిర్వహిస్తాయి.
- ధరల భేదాత్మక చెల్లింపు (PDP): భౌతిక కొనుగోలు సాధ్యపడనప్పుడు, రైతులు మార్కెట్ ధర మరియు మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరల మధ్య తేడాను నగదుగా పొందుతారు. ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. అంతేగాక, ప్రభుత్వం రవాణా మరియు నిల్వ ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తుంది. దీంతో పంట ఉత్పత్తి మిగులు ఉన్న మార్కెట్ల నుండి లోటు మార్కెట్లకు సరఫరా చేయగలగడం ద్వారా వృథా తగ్గుతుంది, మార్కెట్ పరిధి పెరుగుతుంది.
మామిడి రైతులు తెలుసుకోవలసిన విషయాలు: అర్హత మరియు నమోదు
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందాలంటే, రైతులు కొన్ని రిజిస్ట్రేషన్ మరియు డాక్యుమెంటేషన్ ప్రక్రియల గురించి తెలుసుకొని వాటిని పూర్తి చేయాలి.
- నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి గుర్తింపు పొందిన కొనుగోలు సంస్థలతో లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) వంటి సేకరణ సంస్థలతో నమోదు చేసుకోవడం.
- రాష్ట్ర వ్యవసాయ పోర్టల్స్ (ఉపయోగించదగిన చోట)లో నమోదు కావాలి.
- ఆశించిన దిగుబడి, సాగు విస్తీర్ణం మరియు అమ్మకపు రసీదుల వివరాలను సమర్పించడం.
- డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని సులభతరం చేయడానికి వారి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోవడం.
- మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద అమ్మకానికి పంటలో కొంత భాగాన్ని నిలుపుకోవడం మరియు మొత్తం పంటను మొదట్లోనే తక్కువ ధరకు అమ్మకుండా ఉండాలి.
దురదృష్టవశాత్తు తక్కువ అవగాహన, పరిమిత డిజిటల్ అక్షరాస్యత చివరి మైలు కనెక్టివిటీ బలహీనంగా ఉండటంతో చిన్న రైతులు ఈ ప్రయోజనాల నుంచి వంచితులవుతున్నారు. అందువల్ల, గ్రామ స్థాయి విస్తరణ అధికారులు, రైతు భరోసా కేంద్రాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKలు) రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మామిడి రైతులకు చురుకుగా మద్దతు ఇవ్వాలి.
ముగింపు:
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ మామిడి రైతులు తరచూ ఎదుర్కొంటున్న ధరల పతనాలకు పరిపూర్ణమైన లేదా శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు, కానీ, తీవ్ర సంక్షోభ సమయంలో ఇది ఒక కీలక రక్షణ చర్యగా పనిచేయగలదు. ముఖ్యంగా తీవ్ర కష్ట సమయాల్లో మార్కెట్ అస్థిరత కారణంగా తరచుగా బలి అయ్యే అత్యంత దుర్బలమైన మరియు చిన్న తరహా సాగుదారులకు మార్కెట్లో అమ్మగలిగే మిగులు పంటలో గరిష్ఠంగా 25 శాతం వరకు కొనుగోలు చేసే వీలుతో, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తక్షణ ఉపశమనం అందిస్తుంది. అయితే, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ మరింత ప్రభావవంతంగా మారాలంటే కొనుగోలు మరియు సేకరణ పరిమితిని పెంచాలి, ఆలస్యమైన అమలుకరణ, తక్కువ అవగాహన మరియు పరిమిత సేకరణ సంస్థల పరిధి వంటి కార్యాచరణ అడ్డంకులకు తక్షణ విధానపరమైన శ్రద్ధ అవసరం. ఇంకా ఆలస్యం చేసే సమయం లేదు. ధరలు పడిపోతుండగా, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు త్వరగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తూ, దాని పరిధిని విస్తరించి, దేశంలోని పండ్ల రైతుల జీవనోపాధిని కాపాడాల్సిన అవసరం ఉంది.
భారతదేశపు మామిడి రైతులకు ఇది కేవలం ధర విషయమే కాదు, ఇది ఆత్మగౌరవం, జీవనసంరక్షణ మరియు వ్యవసాయ మార్కెట్లో న్యాయం అనే విషయాలపై నిలబడి ఉంది. దీర్ఘకాల ప్రయోజనం కోసం ఇప్పుడే ధైర్యవంతమైన, వేగవంతమైన చర్య అవసరం.
భరత్ కుమార్ మన్నేపల్లి, రీసెర్చ్ స్కాలర్, వ్యవసాయ ఆర్ధిక శాస్త్ర విభాగము, కాశీ హిందూ విశ్వవిద్యాలయము, వారణాసి. ముసాని చెన్నమాధవ, రీసెర్చ్ స్కాలర్, వ్యవసాయ విస్తరణ విభాగము, కాశీ హిందూ విశ్వవిద్యాలయము, వారణాసి. ఫోన్ : 7993145805.


























