రాష్ట్రంలో కొబ్బరి పంట 1141 ఎకరాలలో సాగుతో 68 .46 లక్షల కొబ్బరి కాయల ఉత్పత్తి జరుగుతుంది. రైతులు, కొబ్బరి పంట సాగు ద్వారా సంవత్సరానికి ఒక ఎకరానికి రూ. 80,000 ఆదాయాన్ని పొందుతున్నారు. సరైన పురుగులు మరియు తెగుళ్ల యాజమాన్య చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతులు ఎంతో ఆదాయం నష్టపోతున్నారు. కొబ్బరిని ఆశించే పురుగుల్లో ముఖ్యంగా నల్ల ముట్టె పురుగు, కొమ్ము పురుగు, ఎర్ర ముక్కు పురుగు, ఇరియోఫిడ్ నల్లి, తెల్ల దోమ ముఖ్యమైనవి. గానోడెర్మా తెగులు మరియు నల్ల మచ్చ తెగులు పంటని ఎక్కువ నష్టపరుస్తాయి.
నల్ల ముట్టె పురుగు : –
ఈ పురుగు అన్ని వయస్సుల కొబ్బరి చెట్లను ఆశిస్తుంది, కొబ్బరి మట్టల కింది భాగంలో చేరి, తెల్లని గూళ్ళు కట్టి, ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటుంది.
నష్టం : –
ఈ పురుగు ఆశించిన ఆకులపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. క్రమేణా పురుగు తీవ్రత పెరిగిన కొద్దీ నల్ల మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు ఎండిపోయి, వాలిపోయినట్టు కనిపిస్తాయి. దీనివల్ల తోటంతా కాలిపోయినట్టు అయ్యి కొబ్బరి కాయలు కూడా రాలిపోతాయి. ఈ విధముగా పురుగుకి గురైన చెట్టు తిరిగి కోలుకోవడానికి 2 -3 సంవత్సరములు పడుతుంది.
యాజమాన్యం : –
ముందస్తు చర్యగా పురుగు సోకిన ఆకుల వరుసను తీసి కాల్చివేయాలి. పురుగు తక్కువ స్థాయి లో ఉంటే, బదనికలు వదలాలి. ఎక్కువగా పురుగు ఆశించిన మొక్కలకు డైక్లోరోవాస్ 1.00 మి. లీ./ 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు స్థాయి తీవ్రంగా ఉండి గొంగళి పురుగు దశలో ఉన్నచో వేరు ద్వారా మోనోక్రోటోఫాస్ 10 మి. లీ./ 10 మి. లీ. నీటిలో కలిపి ఎక్కించవలెను.
కొమ్ము పురుగు : –
కొమ్ము పురుగు అనేది దృఢమైన రెక్కలు కలిగిన నల్లని పెంకు పురుగు దీనికి తల పైన కొమ్ము ఉండుటచే దీనిని కొమ్ము పురుగు అని పిలుస్తాము.
నష్టం : –
ఈ పురుగు కొబ్బరి మొక్క లేత మొవ్వు భాగమును, పొత్తులను తొలచి తింటుంది. దీని వల్ల విప్పారని ఆకులు మరియు పొత్తులు నష్టపోయి కొబ్బరి దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు, ప్రత్యక్షంగా నష్టపరచడమే కాక, పరోక్షంగా మొవ్వకుళ్ళు తెగులును ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వ్యాప్తి చేస్తుంది. అంతేకాక కొమ్ము పురుగు నష్ట పరిచిన మొవ్వు భాగం నుండి వచ్చే పులిసిన వాసనకు కొబ్బరి కాండం తొలిచే ఎర్ర ముక్కు పురుగు కూడా ఆశించి నష్ట పరిచే ప్రమాదం ఉన్నది.
యాజమాన్యం : –
3 నెలలకు ఒకసారి కొబ్బరి చెట్టు మొవ్వులో ఆకుల మధ్య భాగంలో, వేప పిండి లేదా వేప గింజల పొడి 100 గ్రాములు 150 గ్రా. ఇసుక కలిపి చల్లాలి. తోటలో పడిపోయిన చెట్లు, కుళ్ళిన చెట్లు, పశువుల ఎరువుల కుప్పలు ఉంచరాదు. పశువుల ఎరువుల కుప్పలు ఉన్నట్లయితే 3 నెలలకు ఒకసారి తిరగవేసి కార్బరిల్ 50 శాతము (3 గ్రా. లీ. నీటికి కలిపి) పిచికారీ చేయాలి. వైరస్ తెగులు సోకిన కొమ్ము పురుగులను ఒక హెక్టారుకు 10 – 15 చొప్పున ప్రతి మూడు నెలలకు ఒకసారి తోటలో వదలాలి. మెటారైజియం ద్రావణాన్ని పశువుల వ్యర్ధ పదార్ధం సేంద్రీయ కుప్పలపై చల్లాలి. కొమ్ము పురుగును ఆకర్షించే రైనోల్యూర్ అనే ఫిరమోన్ ఎరలను బకెట్లో పెట్టి ఐదు ఎకరాలకు ఒకటి చొప్పున పెట్టి ఆకర్షితమైన తల్లి పురుగుల్ని చంపాలి.
ఇరియోఫిడ్ నల్లి : –
ఈ మధ్య కాలంలో ఇతర పురుగులతో పాటు కొబ్బరిని ఆశించి ఎక్కువ నష్టం చేస్తున్న వాటిలో ముఖ్యమైనది ఇరియోఫిడ్ నల్లి. సాధారణంగా 2 -3 నెలల వయస్సు కలిగిన లేత పిందెలను ఈ నల్లి ఆశిస్తుంది. ముచ్చిక కిందగల మెత్తని కణజాలం వద్ద ఈ పురుగులు వేల సంఖ్యలో చేరి రసం పీల్చడం వల్ల మొదట తెల్లని చారలు పొడవుగా ఏర్పడుతాయి. తర్వాత పసుపు లేదా గోధుమ రంగు మొక్కోణపు మచ్చలు ముచ్చిక నుండి కాయ కిందివైపుకు వ్య్యాపిస్తాయి. తర్వాత ఈ మచ్చలు ఎరుపు రంగులో మారి, కాయపై పగుళ్లు ఏర్పడి గజ్జి కాయలుగా మారుతాయి. ఈ పగుళ్ల నుండి కొన్ని సార్లు జిగురు కారుతుంది.
నష్టం : –
నల్లి సోకిన పిందెలు రాలిపోతాయి. కొబ్బరి కాయలు ఎదగక గిడసబారిపోయి పరిమాణం తగ్గిపోతాయి. దాదాపు రైతులు 25 % దిగుబడి నష్టపోతారు. నాణ్యత కూడా తగ్గుతుంది. నల్లి నష్టపరిచిన కాయలపై పీచు గట్టిబడడం వల్ల పీచు పరిశ్రమకు పనికి రావు. దీనివల్ల రైతులు అదనపు ఆదాయం కూడా నష్టపోతారు.
యాజమాన్యం : –
నల్లి ఆశించి రాలిన పిందెలు మరియు కాయలను ఏరిపారేయాలి. తోటలో సిఫారసు చేయబడిన ఎరువులు వేయాలి. (1 కిలో యూరియా, 2 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 2 కిలోల పొటాష్/ చెట్టు/ సంవత్సరం) తడులు సక్రమంగా పెట్టాలి. వేప పిండి 5 -10 కిలోలు/చెట్టు/ సంవత్సరం వేయవలెను. వీటితో పాటు సేంద్రీయ ఎరువులు కూడా వాడవచ్చు. వేప సంబంధితమైన “అజాడిరక్తిన్” 10000 ppm 5 మీ. లీ./ 1 లీ. నీటికి కలిపి గెలలపై పిచికారీ చెయ్యాలి, లేదా 10 మీ. లీ. మందు 10 మీ. లీ. నీటికి కలిపి వేరు ద్వారా ఎక్కించాలి. ఈ విధముగా ఒక సంవత్సరములో మూడు సార్లు చేసిన ఎడల నల్లి బారినుండి పంటను రక్షించి అధిక దిగుబడులు పొందవచ్చు.
కొబ్బరిని ఆశించే తెగుళ్లు : –
కొబ్బరిని ఆసించే తెగుళ్లలో గానోడెర్మా తెగులు ముఖ్యమైనది మరియు అత్యంత ప్రమాదకరమైనది. దీనినే సిగ తెగులు, ఎర్ర లక్క తెగులు, బంకకారు తెగులు, పొట్టులక్క తెగులు అని కూడా అంటారు. సాధారణంగా నవంబర్ నుండి జూన్ మాసములలో ఉండే వాతావరణ పరిస్థితులని బట్టి ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు తీవ్రత మరియు వ్యాప్తి నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే తోటల్లో ఉంటుంది. అదే విధముగా నల్ల నేలల్లో కంటే తేలిక నెలల్లో ఎక్కువ ఉంటుంది. రైతులు పైకి కనబడే కొబ్బరి వేర్లను నరికివేస్తారు. ఇలా చేయడం వల్ల వేర్లు గాయపడి నెలలో ఉండే గానోడెర్మా వేర్ల ద్వారా చెట్టులోకి ఆశించడం జరుగుతుంది.
తెగులు లక్షణాలు : –
మొదట నెల నుండి వేర్లలోకి ఆశించడం వలన ముందస్తుగా మనం గమనించలేము. అధిక శాతం వేర్లు కుళ్ళిన తర్వాత కాండంలోకి ప్రవేశించి పూర్తిగా కుళ్ళేలాగా చేస్తుంది. ఈ దశలు అంతర్గతంగ ఉండడం వల్ల ఎటువంటి చర్యలు చేపట్టలేము, కాండం లోకి చేరిన తెగులు కాండం మొదలు చుట్టూ చిన్న, చిన్న పగుళ్లు ఏర్పడి ముదురు గోధుమ రంగు నుండి తెలుపు వర్ణం కలిగిన చిక్కటి జిగురు కారడం మొదలవుతుంది. ఈ విధముగా కాండం మొదలు కుళ్ళడం వల్ల చెట్టుకి కావాల్సిన నీరు మరియు పోషకాలు భూమి నుండి తీసుకోలేకపోతుంది. ఈ బంక కారడం క్రమేణా చెట్టు పైకి పాకుతుంది. తెగులు సోకిన చెట్టు ఆకులు పసుపు రంగు లోకి మారి వడలిపోయి గోధుమ రంగులోకి మారుతాయి. కొత్త ఆకులు ఆలస్యముగా రావడం వల్ల చెట్టు పైనుండి తక్కువ ఆకులు గమనించవచ్చు. అదేవిధంగా ఆకుల పరిమాణం కూడా తగ్గిపోతుంది. ఈ తెగులు సోకిన చెట్లలో పుష్పాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అదీకాక ఆడ పుష్పాల సంఖ్య కన్నా మగ పుష్పాల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. పిందెలు, కాయలు కూడా రాలిపోవడం మొదలవుతుంది. తెగులు తీవ్రంగా ఉన్న చెట్లలో 70 % వేర్లు పూర్తిగా కుళ్లిపోతాయి. రైతులు అశ్రద్ధ చేసిన యెడల ఆకులు మొత్తం పసుపు రంగులోకి మారి వేళ్ళాడిపొతాయి. మొవ్వ భాగం మొత్తం పూర్తిగా కుళ్లిపోయి, ఆకులు రాలిపోయి 5 – 6 మాసములలో చెట్టు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని సార్లు తెగులు సోకి చివరి దశలో ఉన్న చెట్లపై పుట్టగొడుగులు మొలుస్తాయి. ఈ పుట్టగొడుగులు పై భాగంలో లక్క రంగులోను, కింది భాగంలో తెలుపు లేక బూడిద రంగులో ఉంటాయి. వీటినుండి కోట్లకొద్దీ శిలీంధ్ర బీజములు బయటకు వచ్చి గాలి ద్వారా మిగతా చెట్ల వేర్లకు కూడా వ్యాప్తి చెందును. అందువలన కొబ్బరి చెట్లపై పుట్టగొడుగులు పెరిగే వరకు రావడం అత్యంత ప్రమాదకరం.
జీవ నియంత్రతతో కూడిన యాజమాన్య పద్ధతులు :-
- తోటలో గానోడెర్మా తెగులు గమనించిన వెంటనే తెగులు ఉన్న ప్రాంతమును 1 మీ. లోతు 50 సెం. మీ వెడల్పు గల గోతిని త్రవ్వి మిగిలిన చెట్ల నుండి వేరు చేయాలి. ఇలా చేయడం వల్ల శిలీంధ్ర బీజాలు ఆరోగ్యవంతమైన చెట్టు వరకు వెళ్లవు .
- తోటలోనే చనిపోయిన మరియు తెగులు ఎక్కువగా ఉన్న చెట్లను వేర్లతో సహా తీసి తగలబెట్టాలి. లేకపోతే చనిపోయిన చెట్లపై పుట్టగొడుగులు మొలచి తెగులు వ్యాప్తి నిరోధించడం కష్టం అవుతుంది. రైతులు ఎట్టి పరిస్థితులలోనూ చనిపోయిన చెట్లను తోటలో వదలకూడదు. ఆలా చేస్తే కొత్తగా నాటిన మొక్కలకు కూడా తెగులు సోకే అవకాశం ఉంటుంది.
- చనిపోయిన చెట్ల స్థానంలో కొత్తమొక్కలు నాటే ముందు గుంతలను వారం పది రోజులు సూర్యరశ్మికి బాగా ఎండేలాగా చేయాలి. తర్వాత ఎండు పుల్లలు, చెత్త వేసి బాగా తగలబెట్టడం వల్ల శిలీంధ్ర బీజాలు నివారించవచ్చు. ఈ గోతులలో పశువుల ఎరువు, సేంద్రీయ ఎరువుతో పాటు 50 గ్రా. ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రము 1 కిలో వేప పిండి తో కలిపి వేయాలి.
- ఈ తెగులు ఎక్కువగా తేలిక నెలల్లో వస్తుంది. కాబట్టి రైతులు జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట మొక్కల పూత దశ వరకు పెంచి భూమిలో కలియదున్నటం వల్ల నేలలో సేంద్రియ పదార్దములు పెరిగి నీటిని నిల్వ ఉంచే శక్తి అధికమవుతుంది. దీనితో పాటు గానోడెర్మాను అదుపులో ఉంచే శిలీంధ్రములు కూడా అభివృద్ధి అవుతాయి.
- చెట్టు చుట్టూ 2 మీ. వ్యాసార్థం గల పళ్ళాలను చేసి నీరు పెట్టడం ద్వారా గానోడెర్మా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వ్యాప్తి అవ్వకుండా ఉంటుంది.
- గానోడెర్మా తెగులు ఉన్న నెలల్లో 50 గ్రా. ట్రైకోడెర్మా విరిడి 5 కిలోల వేపపిండితో కలిపి చెట్టుకు ప్రతి సంవత్సరం వేయాలి. ఈ వేపపిండిలో కలిపి వేయడం వలన ట్రైకోడెర్మా బాగా వృద్ధి చెందుతుంది.
- ట్రైకోడెర్మా పొడిని బోర్డాక్సు మిశ్రమములో కానీ ఏ ఇతర మందులతో కానీ కలిపి వేయరాదు.
ఈ విధముగా పురుగులు మరియు తెగుళ్లను సరైన సమయంలో అరికట్టడం వల్ల రైతులు అధిక మొత్తంలో లాభాలను గణించవచ్చు.
నీలిమ, పి. స్రవంతి, డి. గోపాల కృష్ణ మూర్తి, కె. పావని, టి. రమేష్, ఆర్. దీపక్ రెడ్డి, బి. శ్రీనివాస రెడ్డి, ఐ. వి. మరియు జె.హేమంత కుమార్, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఫోన్ : 8184929874


























