రాష్ట్రంలో ఖర్బూజ 11,846 హెక్టార్లలో సాగు చేయబడుతూ సుమారుగా 3,90,918 టన్నులు దిగుబడినిస్తుంది. ఇది అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది (320 సెల్సియస్ వరకు) 230-270 సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా అనుకూలం. నది యొక్క ఇసుక తిన్నెల్లో ఎక్కువగా సాగుచేస్తారు. దీని యొక్క దిగుబడి 4-5ట/ఎకరానికి. ఈ పంటలో వచ్చే పురుగులు, తెగుళ్ళు వాటి నివారణ ఇప్పుడు మనం చూద్దాం..
పురుగులు :-
గుమ్మడి పెంకు పురుగులు :- ఇవి ఆకులను, పూలను తిని నష్టాన్ని కలిగిస్తాయి. నివారణకి ప్రోఫినోఫాస్ 2 మి.లీ లేదా మలాథియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పొట్ల ఆకు పురుగు :- గొంగిళి పురుగులు పంట పెరుగుదల మరియు పూతదశలో ఆకులను కొరికి తినివేస్తాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ లేదా క్వినాల్ ఫాస్ 2 మి.లీ లేదా థయోడికార్బ్1గ్రా. లీటరు నీటికి కలిపి పూత ముందు దశలో చల్లాలి.
పండు ఈగ :- పూత దశలో తల్లి ఈగలు పువ్వుల పై గ్రుడ్లను పెడుతాయి. ఇవి పూత పిందెలలోనికి చేరి కాయలను తిని నష్టపరుస్తాయి. నివారణకి పూత, పిందె దశలో మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 100 మి.లీ మలాథియాన్+100 గ్రా. చెక్కర లేదా బెల్లం పాకం లీటరు నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో పోసి ఈ విషపు ఎరను పొలంలో అక్కడక్కడా పెట్టాలి. ఎకరాకు రెండు పండు ఈగ లింగాకర్షక బుట్టలు పెట్టుకొని, పురుగు ఉధృతిని బట్టి సస్యరక్షణ చేపట్టాలి.

తెగుళ్ళు :-
బూజు తెగులు :- మొదట ఆకుల మీద ఆకు మచ్చ , ముదురాకుమచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తుంది, తరువాత ఆకుల పై భాగాన పసుపు రంగు మచ్చలు, అడుగుభాగాన ఊద రంగు మచ్చలు మరియు బూజు ఏర్పడుతుంది.నివారణకు మాంకోజేబ్ 2.5 గ్రా. లేదా మెటలాక్సిల్ యం.జెడ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు : – ఆకుల పైన తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్ధం ఏర్పడుతుంది. లేత ఆకులు కాకుండా దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది . దీని నివారణకి 1 మి.లీ. ట్రైడిమార్ఫ్ లేదా 1 మి.లీ డైనోకాప్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఫ్యుజేరియం ఎండు తెగులు :- దీనిని ఎండు తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగాఎండిపోతాయి. నివారణకు బోర్డో మిశ్రమము 1% లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పది రోజుల వ్యవధిలో 2-3 సార్లు చేయాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ ను పశువుల ఎరువులో అభివృద్ధి చేసి భూమిలో పాదుల దగ్గర పోయాలి.
వెర్రి తెగులు :- ఆకుల ఈనెల మధ్య మందంగా చారలు ఏర్పడి, పెళుసుగా మారి, గిడసబారి పోయి, పూత పిందె ఆగిపోతుంది.నివారణకు తెగులును వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను నివారించుటకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 2 మి.లీ. మిథైల్ డేమటాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆంత్రాక్నోస్ :- ఆకుల పై, కాయల పై గుండ్రని పక్షి కన్ను ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా కార్బెండజిమ్ 1 గ్రా. లేదా కార్బెండజిమ్+ మాంకోజెబ్ 2 గ్రా. 10 రోజులకు ఒక సారి 2 సార్లు పిచికారీ చేయాలి.
సమగ్ర సస్యరక్షణ చర్యలు :-
- ఎండా కాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి.
- పంటమార్పిడి జొన్న, మొక్క జొన్నతో చేయడం వలన నేల ద్వారా వ్యాపించే ఫ్యుజేరియం ఎండు తెగులు రాకుండా నివారించవచ్చు
- పంట చుట్టూ 4 వరుసలలో రక్షక పంట (జొన్న, మొక్క జొన్న, సజ్జ) వేసినట్లు అయితే వైరస్ తెగుళ్ళను అరికట్టవచ్చు
- 100 గ్రా. విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి 2 గ్రా. చొప్పున వాడి విత్తన శుద్ధి చేయాలి
- నులి పురుగులు ఉన్న చోట వైరస్ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నందున కార్బోసల్ఫాన్ 3 గ్రా. ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి
- అర్క రాజహన్స్ రకం వాడటం వలన బూడిద తెగులును కొంత వరకు నివారించవచ్చు.
- ఎకరాకు 10 పసుపు రంగు జిగురు పల్లాలను పెట్టడం ద్వారా పేనుబంక మరియు తెల్లదోమలను ఆకర్షించి తద్వారా వైరస్ తెగుళ్ళను నివారించవచ్చు.
- పెరుగుదల దశలో నుండి పూత వచ్చే వరకు 5% వేప గింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

తీగ జాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు/తెగులు మందులు వాడరాదు, దీని వలన ఆకులు మాడిపోతాయి
డా. వి. శిల్పకళ, శాస్త్రవేత్త (సస్యరక్షణ), డా. ఎస్. మానస, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. కె. సాయి మహేశ్వరి, శాస్త్రవేత్త(సేద్య విభాగం), డా. టి. మహేష్ బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగం) మరియు డా.కె.అంకయ్య కుమార్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, కె.వి.కె ఊటుకూరు,కడప, ఫోన్ : 7981720286


























