ఈ నెల పంటవ్యవసాయ పంటలు

వేరుశనగ సాగులో – జిప్సం ప్రాముఖ్యత

0

                   భారతదేశంలోని నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో వేరుశనగ 67 శాతం ఉంది. నీటి పారుదల కింద వేరుశనగ దిగుబడులు ఒక స్థాయిలో ఆగిపోవడానికి కారణం తగినంత ఎరువులు వాడకపోవడం. అదే మెట్టసాగులో వేరుశనగ దిగుబడులు తగ్గడానికి ఎరువుల వాడకంలో లోపాలు మరియు బెట్ట పరిస్థితులు ముఖ్య కారణాలుగ చెప్పవచ్చును. ఇతర పంటలతో పోలిచినప్పుడు వేరుశనగ పంట సాగు ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీనికి ప్రధమ కారణం సరైన యాజమాన్య పద్దతులను పాటించకపోవడమే.

నూనె గింజల పంటల్లో ముఖ్యంగా వేరుశనగ పంటకు నత్రజని, భాస్వరం మొదలగు పోషక పదార్థాలు ఎంత అవసరమో కాల్షియం మరియు గంధకం కూడా అంతే అవసరం.

కాల్షియం:

వేరుశనగ “కాల్సీకోల్” గా(అంటే కాల్షియం ఇష్టపడే మొక్క) పిలవబడుతుంది. కాల్షియం లోపించడం వలన 30 కంటే ఎక్కువగా లోప లక్షణాలు ప్రపంచ వ్యాప్తంగా వేరుశనగలో గమనించడమైంది. నాణ్యతగల వేరుశనగ కాయలు ఉత్పత్తి చేయడానికి తగినంత కాల్షియం ఎంతైనా అవసరం.

భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి వేరుశనగ మొక్కలో ఈ కాల్షియం మొదట నాలుగు వారాలలో క్రమేణా పెరిగి తర్వాత పంట కోత దశ వరకు ఒక స్థాయిలో ఉండి పోతుంది. ఈ కాల్షియం పాత్ర  వేరుశనగపై చాలా ఎక్కువగా ఉంటుంది.

కాల్షియం వలన మొక్కలు బాగా మొలకెత్తడం, మొలకెత్తినవి ఎక్కువ శాతం బతకడానికి, వేర్లు ఏపుగా పెరగడానికి తద్వారా బెట్టను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది మరియు కాయ నిండడానికి దోహదం చేస్తుంది. వేరు చివర కాల్షియం ఉండటం వలన కొత్త కణాలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. వేర్లలో బుడిపెల చర్యను వృద్ధి చేయడానికి దోహదపడుతుంది.

మొక్కల కణంలోని కణుపు గోడలకు కాల్షియం పెక్టెన్ మధ్య పొరగా ఉంటుంది. వేరుశనగ కాయలు వృద్ధి చెందు ప్రాంతంలో (ఫ్రిటింగ్ జోన్)  కాల్షియం ఉండటం వలన  అండాశయం విచ్ఛిన్నతి  తగ్గించి మొక్కకు కాయలు ఎక్కువగా ఉండటానికి తద్వారా దిగుబడులు పెరగడానికి ఉపయోగపడుతుంది. పిండి పదార్థాల రవాణాపై కాల్షియం ప్రభావం ఉంటుంది. భూమిలోని సూక్ష్మ క్రిముల అభివృద్ధికి కావలసిన వాతావరణాన్ని కాల్షియం కలుగజేస్తుంది. కాల్షియం ఊడలకు శక్తినివ్వటమే కాకుండ వాటి పెరుగుదలకు తోడ్పడుతుంది.

గంధకం:

గంధకము వేరుశనగ పౌష్టికతలో బహుముఖ పాత్ర కలిగి ఉన్నది. ఎందుకంటే వేరుశనగ విత్తనం 50 శాతం నూనెతో పాటు 25 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది. గంధకం మొక్కల శ్వాసక్రియకు అవసరం. వేరు పైగల బుడిపెల అభివృద్ధిలో కూడ ప్రముఖ పాత్ర కలిగి ఉన్నది. ఇది అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ మరియు ఫ్యాటీ ఆమ్లాలలో ముఖ్య భాగము. వేరుశనగ గింజలలో నూనె బాగా పట్టుటకు గంధకము ప్రముఖ పాత్ర కలిగి ఉన్నది. గంధకము వేరుశనగ కాయల రంగును అభివృద్ది చేయుటకు, ఆకులు ముందే రాలిపోకుండ అరికట్టుటకు, మొక్కలకు కాయలు బాగా అతుక్కొని ఉండుటకు దోహదపడుతుంది. మొక్కలలో తగినంత గంధకం ఉండటం వలన వివిధ రకాలైన బూజు తెగులు అరికట్టు శక్తి ఉంటుంది. ఊడలు మరియు కాయలు గంధకాన్ని గ్రహిస్తాయి. కాబట్టి కాయలు పెరిగే ప్రాంతంలో తగినంత గంధకం లభ్యమయ్యేటట్లు చూడాలి.

కాల్షియం లోప లక్షణాలు:

  • వేరుశనగలో తాలుకాయలు ఎక్కువగా ఉంటాయి.
  • మొక్క తొడిమ పచ్చగా మారి మొక్క చివరలు వాడిపోయి ఎండిపోవడం, వేరు దెబ్బతినడం జరుగుతుంది.
  • వేరు వాతావరణంలోని నత్రజనిని గ్రహించే శక్తి కోల్పోతాయి.
  • కిరణ జన్య సంయోగ క్రియకు కావల్సిన పత్రహరితం ఉత్పత్తి కాదు. పూత తగ్గిపోయి దిగుబడి కూడ తగ్గిపోతుంది.

గంధక లోప లక్షణాలు:

  • లేత ఆకులు చిన్నవై, వివర్ణమై నిటారుగా ఉంటాయి.
  • ఆకులు పసుపు పచ్చగా మారును. మొక్క పరిమాణం తగ్గిపోవును.
  • ఇసుక నేలల్లో గంధకంలోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

వేరుశనగకు పైన తెలిపిన కాల్షియం మరియు గంధకం పోషక పదార్థాలను జిప్సం అందజేస్తుంది. జిప్సంలో వేరుశనగకు కావాల్సిన కాల్షియం, గంధకం ఉండటం వలన జిప్సం యొక్క పాత్ర, ఈ రెండు పోషక పదార్థాల ద్వారా వివరించవచ్చును. జిప్సంను “ల్యాండ్ ప్లాస్టర్” అంటారు. అంతేకాకుండ జిప్సం నేల యొక్క భౌతిక పరిస్థుతులను మెరుగుపరచి వేరుశనగలో అధిక దిగుబడులు పొందుటకు దోహదపడుతుంది. జిప్సంలో 24 శాతం కాల్షియం మరియు 18.6 శాతం గంధకం ఉంటుంది. కేవలం 10 మి.మీ. వర్షంలో కాని నీటి పారుదలలో కాని జిప్సం చాలా సులభంగా కరుగుతుంది..

ఇతర పోషక పదార్థాల గ్రహింపుపై జిప్సం ప్రభావం:

జిప్సంను విత్తేటప్పుడుగాని లేదా ఊడలు దిగే సమయంలోగాని వేయడం వలన నత్రజని, భాస్వరం మరియు పొటాషియంను ఎక్కువగా గ్రహిస్తాయి. అంటే జిప్సం వేయడం వలన వేరుశనగలో ఇతర పోషక పదార్థాల గ్రహింపు కూడా ఎక్కువ ఉంటుంది.

జిప్సం వేసే పద్ధతి మరియు మోతాదు:  

జిప్సం ఎరువును మెత్తగా పొడి చేసి వేయాలి. మొక్క మొదలుకు చుట్టూ 5 సెం.మీ. లోతు వరకు ఉన్న మట్టిలో కలియబెట్టాలి. వీలైతే జిప్సం వేసే పరికరం ఉపయోగించాలి. ఈ పరికరంతో మొక్కల మధ్య అంతర కృషి, మొక్క మధ్యలో జిప్సం వేయడం రెండు పనులు ఒకేసారి జరుగుతాయి. కాల్షియం మరియు గంధకం వేరు వేరుగా వేయడం కంటే ఒక ఎకరాకు 200 కేజీల జిప్సంను విత్తిన 25 – 45 రోజుల మధ్య వేయడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చు.

డా. డి.శ్వేత, డా. సిహెచ్. పల్లవి, ఎ. సరిత, డా. ఎ. రమాదేవి మరియు డా. జి. సంతోష్ కుమార్ వ్యవసాయ పరిశోధన స్థానం మరియు ఏరువాక కేంద్రం, తోర్నాల

Leave Your Comments

బ్లూడోర్ గ్లోబల్ సొల్యూషన్స్: ఎర్డెన్ అగ్రి తో పునరుత్పాదక వ్యవసాయానికి మార్గదర్శకత్వం

Previous article

వ్యవసాయం మరియు స్థిరమైన జీవనోపాధిని పెంపొందించడానికి నాబార్డ్ మరియు సిఇఇడబ్ల్యు చేతులు కలిపాయి

Next article

You may also like