ఆరోగ్యంగా తినడం అనేది సరైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవడం, వంటలో నూనె, ఉప్పు, చక్కెర మొదలైనవాటిని తగ్గించడం మాత్రమే కాదు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా, సేంద్రీయంగా పండించిన ఉత్పత్తులను తీసుకోవడం, కోసం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే కూరగాయలు, ఆకు కూరలపై విచక్షణ రహితంగా పురుగు మందుల్ని పిచ్చికారి చెస్తున్నారు, వాటి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి ఎలాంటి పురుగు మందులూ లేకుండా మనం ఆకుకూరల్ని తినాలంటే వీలు వున్నవారు ఇంటి దగ్గరే వాటిని పెంచుకోవడం చాలా మంచిది . కరొన తరువాత ప్రజలందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద పెడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటిస్తున్నారు ముఖ్యంగా మిద్దె మీద కూరగాయలు పెంచడం, పెరటి తోటలు పెంచడం, వివిధ రకాల గింజల నుంచి మొలకలు తీసుకోవడం చేస్తున్నారు, ఇలాంటి కోవకు చెందినవే మైక్రో గ్రీన్స్. స్థలం లేని వారికి మైక్రో గ్రీన్స్ మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఆకు కూరలతో పోలిస్తే వీటిని పెంచడమూ తేలిక, ఎక్కువ పోషకాలు కలిగి వుంటాయి
మైక్రో గ్రీన్స్ అంటే ఏంటి..?
మొలకెత్తిన విత్తనాలను మనం మొలకలు అంటాం ఇలా మొలకెత్తిన విత్తనాలను రెండు మూడురోజులు ఉంచి నీళ్ళు చల్లుతూ కాస్త గాలి, వెలుతురు తగిలేలా నీడలో ఉంచుకుంటే మొలకెత్తిన విత్తనం మొక్కగా ఎదిగి రెండు మూడు ఆకులు వస్తాయి అలా వచ్చిన వాటినే మైక్రో గ్రీన్స్ అంటారు.
మొలకలలాగే మైక్రోగ్రీన్స్ను ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలుగా పరిగణిస్తున్నారు. అయితే మొలకలు, మైక్రోగ్రీన్స్ రెండూ ఒకటి కావు. తక్కువ వయస్సు ఉన్న సూక్ష్మ ఆకుకూరలు, ఇవి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.
మైక్రో గ్రీన్స్లో పోషకాలు:
మైక్రోగ్రీన్స్ అనేవి పోషకాలతో నిండిన సూపర్ ఫూడ్స్. ఇవి చూడటానికి పచ్చి మొలకలలా ఉంటాయి. మొలకల్లాగే మైక్రోగ్రీన్స్ ను కూడా ఇంట్లో సులభంగా పెంచవచ్చు. సాధారణంగా ఇవి పెరగడానికి ఒక వారం పడుతుంది. వీటిని వంటగది కిటికీ దగ్గర, బాల్కనీలలో లేదా వరండాలలో సరైన లైటింగ్తో ఉన్నచోట పెంచుకోవచ్చు. మొలకెత్తిన 7-21 రోజుల తర్వాత కోతకు వస్తాయి. మనకు 60 రకాలకు పైగా మైక్రోగ్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రొద్దుతిరుగుడు, ముల్లంగి, బ్రోకలీ, ఎర్ర క్యాబేజీ మొదలైనవి ఉన్నాయి. మైక్రోగ్రీన్స్లోని పోషక స్థాయిలు పచ్చని ఆకుకూరల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మైక్రోగ్రీన్స్లో మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి, పచ్చిగా తింటే ఈ పోషక విలువలు తగ్గిపోకుండా శరీరానికి అందడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో 40 శాతం వరకు ఫైటో కెమికల్స్ ఉండడం వలన మామూలు ఆకు కూరలతో పోలిస్తే వీటిలో 40 రెట్లు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
శరీరంలోని జీవప్రక్రియల వల్ల ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాలు తయారవుతాయి. ఇవి అధికసంఖ్యలో ఉంటే కణాల పనితీరును దెబ్బతీసి అనారోగ్యం పాలు చేస్తాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, పార్కిన్సన్స్ మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని యాంటీ ఆక్సిడెంట్లు నివారిస్తాయి. ఇవి సహజ సిద్ధంగా కానీ, కృత్రిమంగా కానీ లభిస్తాయి. ఆహార పదార్థాల ద్వారా లభించేవి సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు. రంగురంగుల పండ్లు, కూరగాయల్లో ఇవి అధిక మోతాదుల్లో ఉంటాయి. ముఖ్యంగా శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. తాజాపండ్లు, సలాడ్లలో ఉండే విటమిన్- సి కూడా యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. టమోటా, పుచ్చకాయల్లో అధికంగా ఉండే లైకోపిన్ మరొక యాంటీ ఆక్సిడెంట్. బియ్యం, గోధుమలు, పప్పులు లాంటి ధాన్యాల్లో ఉండే సెలీనియం అనే ఖనిజం కూడా యాంటీ ఆక్సిడెంటే. ముదురు గులాబీ, ఎరుపు, పసుపు, నారింజ, వంగపండు రంగుల్లోని ఆహారంలో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్, కాటెచిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాలానుగుణంగా వచ్చే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కృత్రిమ యాంటీ ఆక్సిడెంట్లు తీసుకుంటే కొంత వరకు ఉపయోగం ఉన్నా సహజమైనవే మేలు. వైద్యుల సలహా లేకుండా మందుబిళ్లలు, సప్లిమెంట్ల రూపంలో వీటిని తీసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ.
మైక్రో గ్రీన్స్ తినడం వల్ల లాభాలు:
వీటిని తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జ్ఞాపక శక్తి తగ్గదు. మధుమేహం ప్రమాదం తగ్గుముఖం పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లూ దరి చేరవు. మైక్రోగ్రీన్లు తింటే అవి శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, లివర్ కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల స్థాయిలను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మైక్రోగ్రీన్స్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంచి ఆహారం. మలబద్ధకం, ఇతర జీర్ణశయ సమస్యలను నివారిస్తాయి. క్యాన్సర్తో బాధ పడేవారికి మైక్రోగ్రీస్స చాలా మంచి ఆహారం ల పనిచేస్తాయి. మైక్రోగ్రీన్లలో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉన్నందున, ఇది అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదు.
మైక్రో గ్రీన్స్గా వేటిని పెంచుకోవచ్చు:
ఆవాలు, మెంతులు, పెసర్లు, బీట్రూట్, బ్రోకలీ, ఎర్ర క్యాబేజీ గింజలు, ముల్లంగి విత్తనాలు తదితరాలను మైక్రో గ్రీన్స్గా పెంచుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లో కాస్త మట్టి వేసి వీటిని ఒత్తుగా చల్లుకుని రోజూ నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి. ఆరు నుంచి పది రోజుల్లోపు వీటిని కోసేసుకోవచ్చు. రెండు నుంచి మూడు అంగుళాలు ఎదిగితే ఇక కోసేసుకోవచ్చని అర్థం చేసుకోవాలి.
మైక్రోగ్రీన్స్ పెంపకం కోసం ఏవి అవసరం
- ట్రే లేదా కంటైనర్,2. కోకోపీట్, 3. ఎరువు, 4. విత్తనాలు, 5. నీరు
ముందుగా ట్రే లేదా కంటైనర్ ను పాక్షికంగా ఎండ ప్రదేశంలో ఉంచాలీ తరువాత కోకోపీట్ మరియు సేంద్రియ ఎరువును విత్తుకోవాలి. అనంతరం కోకోపీట్ లో విత్తనాలను విత్తుకొని మరియు రోజుకు రెండుసార్లు నీటిని చల్లు కోవాలి. ఇలా చేయడం వల్ల 5-6 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఇవి రెండు అంగుళాల పొడవు పెరిగిన తర్వాత, ఒక జత కత్తెర ఉపయోగించి వాటిని కత్తిరించి వాడుకోవచ్చును. విత్తనాలను విత్తే ముందు రాత్రిపూట నానబెట్టి విత్తుకోవడం వల్ల మొలకశాతం బాగుంటుంది. కోకోపీట్ ను తేమగా ఉంచుకోవాలి మరియు ట్రేని అధిక సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి .
మైక్రో గ్రీన్స్ని ఎలా ఉపయోగించుకోవాలి:
ఈ చిన్న మొలకల్లాంటి ఆకుల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎక్కువగా వేడి చేసి వండేయడం ద్వారా పోషకాలు నశిస్తాయి. బదులుగా వాటిని కూర వండుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర చల్లుకున్నట్లు చల్లి దించుకోవాలి. అప్పుడు ఎక్కువ పోషకాలు మన శరీరంలోకి చేరి మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. మైక్రోగ్రీన్స్ పచ్చిగా తినవచ్చు,వాటిని టోస్ట్స్, పిజ్జాలు లేదా సూప్ మీద అలంకరించడానికి ఉపయోగించవచ్చు,సలాడ్లలో వీటిని వేస్తె అవి అధిక పోషకాలను ఇస్తాయి.
వెన్న / నూనె తో వేయించాలి. స్మూతీస్, షేక్స్ మరియు జ్యూస్లో వీటిని వేసుకోవచ్చు. వాటిని శాండ్ విచ్ మరియు ర్యాప్ ఫిల్లింగ్స్లో వాడవచ్చును, అలాగే స్మూతీల్లో చేర్చుకోవచ్చు. కాస్త వెన్నలో ఒక్క నిమిషం పాటూ వేయించి తినొచ్చు. ఇంకా సలాడ్లలో నేరుగా చేర్చకోవచ్చు. బర్గర్లు, పీజాలు, రోల్స్ లాంటి వాటిలో పైన టాపింగ్లా పెట్టుకుని తినవచ్చును. మాంసం, చేపల పైన కొంచెం చల్లుకోవచ్చు లేదా గిలకొట్టిన గుడ్లు, ఆమ్లెట్లలో కలపవచ్చు.
డా. కె సుధా రాణీ – గృహావిజ్ఞాన శాస్త్రవేత్త, డా.జి టి మాధవి – ఉద్యాన శాస్త్రవేత్త, బి చందన – విస్తరణ శాస్త్రవేత్త, డా. కె. మాధవి – పశు పోషణ శాస్త్రవేత్త, డా శశికళ – సస్య ఉత్పత్తి శాస్త్రవేత్త, డా కిశోర్ రెడ్డి – సస్యరక్షణ శాస్త్రవేత్త, డా ఎస్ ఎన్ మల్లేశ్వరి సాధినేని – కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం, రెడ్డిపల్లి, అనంతపురం జిల్లా.


























