మన రాష్ట్రంలో తెల్ల బంగారంగా భావించే పత్తి ప్రధానమైన వాణిజ్య పంట. పత్తి పంట సాగుకు నల్లరేగడి నేలలు అనువైనప్పటికిని, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో ప్రత్తి పండిస్తున్నారు. అయితే, అధికశాతం విస్తీర్ణం కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు, ఎన్.టి.ఆర్, ప్రకాశం మరియు అనంతపురం జిల్లాలలో వున్నది. పత్తి పంటలో కాయ తొలిచే పురుగులు ప్రధానమైన సమస్యలు. వీటిని సకాలంలో నివారించక పోతే నష్ట తీవ్రత అధికంగా వుంటుంది.
కాయతొలుచు పురుగుల సమగ్ర సస్యరక్షణ :
• పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి.
• వేసవి దుక్కులు లోతుగా దున్నాలి.
• 25% సేంద్రియ ఎరువులు, 75% రసాయన ఎరువులు వాడాలి.
• బొబ్బర (అలసంద), కొర్ర, సోయాచిక్కుడు, పెసర, మినుము, గోరుచిక్కుడు 1:2 నిష్పత్తిలో అంతర పంటలుగా వేయాలి. చేను చుట్టూ నాలుగు వరుసల జొన్న లేక మొక్కజొన్న కంచె పంటగా వేయాలి.
• లద్దెపురుగును ఆకర్షించటానికి ఎకరాకు 50 ఆముదపు మొక్కలు చేనులో అక్కడక్కడ నాటుకొని, ఆముదపు మొక్కలపై పెట్టిన లద్దెపురుగు గ్రుడ్లను, జల్లెడ ఆకులను ఏరి నాశనం చేయాలి.
• శనగపచ్చ పురుగును ఆకర్షించటానికి ఎకరాకు 100 పసుపురంగు పూలు పూచే బంతి మొక్కలు పెట్టి మొగ్గలు, పూలలో వున్న పురుగులను ఏరివేయాలి.
• శనగపచ్చ పురుగు, లద్దెపురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేయటానికి ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. ప్రతి బుట్టలో మూడు రోజులు వరుసగా రోజుకు గులాబి రంగు పురుగులు 8, శనగపచ్చ పురుగులు 10, పొగాకు లద్దె పురుగులు 20, మచ్చల పురుగులు 15 చొప్పున మూడు రోజులు వరుసగా పడిన ఎడల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
• విత్తిన 80-100 రోజుల మధ్యకాలంలో మొక్కల తలలు త్రుంచాలి.

• పురుగు గ్రుడ్లను, మొదటి దశ పిల్ల పురుగులను, నివారించటానికి 5 శాతం వేప గింజల ద్రావణాన్ని (10 కిలోల వేపగింజల పొడి 200 లీటర్ల నీళ్ళలో 24 గంటలు నానబెట్టి వడపోసిన ద్రావణం) పిచికారి చేసుకోవాలి.
• పురుగులను తినే పక్షులు వాలటానికి వీలుగా ‘టి’ ఆకారపు కర్రలను లేక పంగల కర్రలను ఎకరాకు సుమారు 15-20 పెట్టాలి.
• పురుగుల నష్ట పరిమాణం దృష్టిలో వుంచుకొని లీటరు నీటికి క్వినాల్ఫాస్ 25 ఇ.సి. 2.5 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 20 ఇ.సి. 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 ఎస్.పి. 1.5 గ్రా. లేదా థయోడికార్డ్స్ 75 డబ్ల్యూ. పి. 1.5 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి. పచ్చ పురుగు గ్రుడ్లు ఎక్కువగా వుంటే ప్రొఫెనోఫాస్ 50 ఇ.సి. 2 మి.లీ లేదా థయోడికార్బ్ 75 డబ్ల్యూ.పి. 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఒకే పురుగు మందును ఎక్కువసార్లు పిచికారీ చేయకుండ మందులు మార్చి మార్చి వాడుకోవాలి.
• పచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా వున్నప్పుడు మూడవ దశ దాటిన పచ్చపురుగును చేతితో ఏరివేయాలి.
• పురుగు నివారణకు లీటరు నీటికి ఇండాక్సాకార్బ్ 15.8 ఇ.సి. 1 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45 ఎస్.సి. 0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి. 0.5 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్ 48 ఎస్.సి. 0.2 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్.సి. 0.3 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
• పొగాకు లద్దెపురుగును నియంత్రించుటకు సమగ్ర సస్యరక్షణ పాటిస్తూ, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి నొవాల్యూరాన్ 10 ఇ.సి. 1 మి.లీ. లేదా థయోడికార్బ్ 75 డబ్ల్యూ. పి. 1.5 గ్రా. లేదా ఇమామెక్టిన్ బెంజొయేట్ 5 ఎస్.జి. 0.5 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్ 48 ఎస్.సి. 0.2 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్.సి. 0.3 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. మూడవ దశ దాటిన లద్దెపురుగును

అదుపుచేయటానికి విషపు ఎరను వాడాలి (ఎకరానికి 10 కిలోల తవుడు మరియు 2 కిలోల బెల్లంతో పాటు 750 మి.లీ. క్లోరిపైరిఫాస్ జోడించి ఈ మిశ్రమానికి తగినన్ని నీళ్ళు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం సమయంలో పొలమంతా వెదజల్లాలి).
గులాబి రంగు కాయతొలచు పురుగు సమగ్ర యాజమాన్యం:
ఆర్ధిక నష్టపరిమితి స్థాయిని గుర్తించే విధానం :
• గులాబి రంగు పురుగు ఉనికిని గుర్తించడానికి పంటపై ప్రత్యేక నిఘా ఉంచాలి.
• పొలంలో అక్కడక్కడా 50 పువ్వులను గమనించినప్పుడు వాటిలో 5 గుడ్డి పూలు ఉన్నట్లయితే లేదా పొలంలో అక్కడక్కడ ఒక మొక్కకు ఒక కాయ చొప్పున 20 కాయలను సేకరించి కోసి చూసినప్పుడు, 20 కాయలకు రెండు గొంగళి పురుగులను గమనించినట్లయితే, నష్టపరిమితి స్థాయిగా నిర్ధారించు కొని సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుది.

పురుగు ఉనికిని నిర్ధారించే లక్షణాలు :
• గుడ్డి పూలు కాయ పైభాగం లో పురుగు బయటకి వచ్చే గుండ్రటి చిన్నటి రంధ్ద్రం మరియు కాయ తొనల మధ్య గ్రుడ్డి ప్రత్తి మరియు రంగు మారిన పత్తి
సమగ్ర యాజమాన్య పద్దతులు :
సమగ్ర యాజమాన్య పద్దతులను అనుసరించి గులాబి రంగు పురుగును సమర్ధవంతంగా నివారించుకోవచ్చును.
ప్రధానంగా పంట తీసిన తర్వాత, పంటలేని సమయాన, విత్తడానికి ముందు మరియు పంటకాలంలో వివిధ చర్యలు చేపట్టాలి.

పత్తి విత్తడానికి ముందు మరియు పంటకాలంలో చేపట్టవలసిన యాజమాన్య పద్దతులు :
• పంట మార్పిడి పద్ధతిని రెండు – మూడు సంవత్సరాలకొకసారి విధిగా పాటించాలి.
• తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపికచేసుకొని సకాలంలో విత్తుకోవటం ద్వారా గులాబి రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చును.
• పత్తి పొలంలో మరియు చేను చుట్టూ తుత్తురు బెండ, ఉమ్మెత్త లాంటి ఆతిథ్య మిచ్చే కలుపు మొక్కలు లేకుండా చేయడం మరియు పత్తి పంట దగ్గరలో బెండ పంట లేకుండా చూసుకోవాలి.

• పంటకు సంబంధించి సకాలంలో సమగ్రవంతమైన యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా సేంద్రియ ఎరువులు మరియు నత్రజని ఎరువుల సమతుల్యత పాటించి ఉధృతిని తగ్గించవచ్చు.
• పత్తి పంట విత్తిన 45 రోజుల నుండి గులాబి రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి, వరుసగా బుట్టలలో మూడురోజులు. రోజుకు 8 రెక్కల పురుగులను పడటం గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
• గులాబి రంగు పురుగు ఆశించిన గుడ్డిపూలు, రాలిన పూత మరియు పిందెలను పంటకాలములో గమనించినట్లయితే వెంటనే సేకరించి సమూలంగా నాశనం చేయాలి.
• ట్రైకోగ్రామా పరాన్నజీవులను ఒక ఎకరానికి 60,000 చొప్పున మూడు విడతలుగా, వారం రోజుల వ్యవధిలో పూత పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు విడుదల చేయడం వలన గుడ్ల దశలోనున్న పురుగును నివారించవచ్చు.
• గులాబి రంగు పురుగు ఉధృతి ఆర్ధిక నష్టపరిమితిస్థాయి దాటిన వెంటనే నివారణకు ఈ క్రింది రసాయనిక మందులను పిచికారి చేసుకోవాలి.
• క్వినాల్ఫాస్ 25 ఇ.సి. 2.0 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 20 ఇ.సి. 2.5 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్ 50 ఇ.సి. 2 మి.లీ. లేదా పైరిడాలిల్ 10 ఇ.సి. 300 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
• పంట ఆఖరిదశ కాలంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన సైపరెమెత్రిన్ 25 ఇ.సి. 1.0 మి.లీ లేదా లామ్దసైహలోత్రిన్ 5.0 ఇ.సి. 1.0 మి.లీ. లేదా బైఫెన్స్ 10 ఇ.సి. 1.6 మి.లీ. చొప్పున ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు.
గమనిక: సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు ప్రత్తి పంటపై ఎక్కువ సార్లు పిచికారి చేయరాదు. చేసినట్లయితే రసం పీల్చే పురుగులైన పేనుబంక మరియు తెల్లదోమ యొక్క ఉధృతి పెరిగే అవకాశమున్నది.

డా.ఐ.వెంకటేష్, డాక్టర్. జి. ప్రసాద్ బాబు, వివేక్ కామత్, డా. జ్యోతి, శాస్త్రవేత్త, కె.వి.కె, కందుకూరు మరియు డా. యం. శేషుమాధవ్, ఐ.సి.ఎ.ఆర్.- నిర్కా,భారత వ్యవసాయ పరిశోధనా మండలి – జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ,రాజమండ్రి, కృషి విజ్ఞాన కేంద్రం, కందుకూరు.
Leave Your Comments


























