పరిమాణంలో అతి పెద్దదిగా, దిగ్గజంగా భావించే ఆఫ్రికన్ నత్తను శాస్త్రీయంగా అచటినా ఫులికా అంటారు. ఈ ఆఫ్రికన్ నత్త అచటినా అను తరగతికి మొలస్కా అను వర్గానికి చెందినది. ఈ నత్తలు మన దేశానికి బ్రిటీష్ వారి కాలంలో 1847వ సంవత్సరంలో విలియం హెన్రీ ద్వారా కలకత్తా చౌరంగీ గార్డెన్ లోకి ప్రవేశించి, ఆ తరువాత బహుళ వృక్షహార జీవిగా అవతరించి దాదాపు 500 రకాల మొక్కలను ఆశించి నష్టపరుస్తుంది. ఇవి అత్యంత ప్రమాదకరమైన 100 జాతులలో ఇది ఒక జాతిగా చెప్పవచ్చు. ఈ నత్తలు తన జీవితకాలంలో 15 సెం.మీ. పొడవు మరియు 5-8 సెం.మీ. వెడల్పు వరకు పెరుగుతాయి. ఈ నత్తలు ముఖ్యంగా బొప్పాయి, మామిడి, కాఫీ, రబ్బరు, పత్తి, రాగులు, కొబ్బరి, ప్రొద్దుతిరుగుడు, అపరాలు, నూనెగింజలు, కూరగాయలు అయిన వంగ, దోస, క్యాబేజి, కాలీఫ్లవర్, బెండకాయ వంటివే కాకుండా, అరటి, మల్బరీ మరియు బంతి పూల తోటలను ఆశించి నష్టపరుస్తాయి.
ఈ యొక్క ఆఫ్రికన్ అడ నత్తలు మగ సత్తలతో సంపర్కం జరిగిన తరువాత 2-3 వారాలలో గుండ్రటి పసుపు వర్ణంలో, గుంపుగా దాదాపు 300 గ్రుడ్లులను పెట్టి దాని యొక్క శ్లేష్మంతో కప్పుతాయి. ఈ గుడ్లను ఎండిన ఆకుల అడుగు బాగాన, భూమిలో గాని పెడతాయి. ఈ నత్తలు దాదాపు 5-7 సంవత్సరాలు బ్రతికి ఉంటూ దాదాపు 1000-1200 గుడ్డును దాని జీవిత కాలంలో పెడుతుంది. ఈ విధంగా పెట్టిన గుడ్లు 15 రోజులలో పగిలి, చిన్న నత్తలు బయటికి వస్తాయి. ఇలా బయటకు వచ్చిన తరువాత శ్లేష్మంతో తడుపుకుంటూ ఆహార అన్వేషణలో , ముందుకు సాగి, పంటలను ఆశించి నష్టపరుస్తాయి. ఈ నత్తలు ముఖ్యంగా నెలల కాలంలో అతి పెద్దదిగా మారి దానిపైన గుల్ల చిప్పను దాదాపు 7-9 ముడతలు వచ్చే వరకు పరిమాణంలో పెరుగుతుంటాయి. ఇది తరువాత ఆడ మరియు మగ నత్తలగా మారి సంపర్కానికి తయారవుతాయి. ఈ నత్తలు ముఖ్యంగా రాత్రి సమయంలో తింటూ, పగటి సమయంలో భూమిలో నెర్రలలో, ఆకుల క్రింద భాగాన చేరి సేద తీరుతాయి. ఎక్కడైతే తక్కువ ఉష్ణోగ్రత (9-30 డి. సెం.) మరియు అధిక తేమశాతం (80%) ఉంటుందో ఆ ప్రాంతాలలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో, విశాఖపట్నం ప్రాంతాలలో బొప్పాయి, జామ, అరెకనట్, చామంతి మొక్కలపైన ఆశించి ఆకులను, పుష్పాలను, కాయలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా నిజామాబాద్ జిల్లాలోని శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలలో గల బొప్పాయి తోటలను కూడా ఆశించి నష్టపరిచింది. ఈ ఆఫ్రికన్ నత్తలను సకాలంలో నియంత్రించకపోతే చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
సమగ్ర సస్యరక్షణ చర్యలు :-
- మొదటగా మన తోటల చుట్టూ, పొలంలోని కలపు మొక్కలను పీకి తీసివేయాలి. దీని ద్వారా కలుపు మొక్కలు ఆశ్రమాలుగా మారడానికి అవకాశం ఉండదు.
- చేతులకు గ్లోవ్స్ వేసుకుని పొలంలో వుండే నత్తలను అన్నింటిని ఏరివేసి ఒక బకెట్లో వేసి 5% ఉప్పు ద్రావణాన్ని పోసినట్లయితే ఈ నత్తలన్నీ కూడా చనిపోతాయి.
- వేసవి దుక్కులు చేసుకుంటే భూమిలో నుండి ఈ నత్తలను బయటికి తీసి శత్రుజీవులకు ఆహారంగా మార్చవచ్చు.
- నేలను పాకే తీగజాతి పంటలు అయిన బబ్బరగాని, బీన్స్ గాని, ఉలవలు గాని అంతర పంటలుగా వేయరాదు. ఇది ముఖ్యంగా నత్తలకు ఆశ్రయంగా మారుతాయి.
- గోనె సంచులను నీటిలో ముంచి తోటలలో అక్కడక్కడా వేయడం ద్యారా ఈ నత్తలు ఆకర్షించబడతాయి. తరువాత రోజు ఉదయం ఈ నత్తలను ఏరి ఉప్పుద్రావణం (5%)లో వేయడం ద్వారా చంపవచ్చును.

- ఈ నత్తలను విషపు ఎరను కూడా వాడి నియంత్రించవచ్చును. దీనికి గాను 25 కిలోల తవుడు, 3 కిలోల బెల్లం, 100 గ్రా. థయోడికార్బ్ 100 మి.లీ. ఆముదం నూనె కలిపి చిన్న ఉండలుగా చేసి వేయడం ద్వారా నియంత్రించవచ్చును.
- అంతేకాకుండా పొగాకు కాడెలను (50 గ్రా.) 1.5 లీ. ద్రావణంలో ఉడకబెట్టి చివరగా 60 గ్రా. కాపర్ సల్ఫేట్ను కలిపి పిచికారి చేసుకుంటే వీటిని నియంత్రించవచ్చును.
- మెటాల్డిహైడ్ అను నత్తల మందును (2.5%) పెల్లెట్ల్ రూపంలో ఒక హెక్టార్కి, ఒక స్పాట్ కి 2-3 పెల్లెట్లు ఉంచుకుని వేసినట్లయితే వీటిని నివారించవచ్చు.
యస్ . శ్రీనివాస్ నాయక్, యస్. మాలతి,ఇ .రాంబాబు, ఎస్. వంశీ కృష్ణ,వి. రవీందర్ నాయక్, వ్యవసాయ కళాశాల, వరంగల్, ఫోన్ : 8778857772



























