ప్రస్తుతం రైతులు వరి పంటలో కోతలకు యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ యంత్రాలు వరి మొదళ్ళను నేలకు దగ్గరగా కాకుండా 25-30 సెం.మీ. ఎత్తులో కోయడం వల్ల గడ్డి కోయ కాళ్ళ రూపం లో పంట అవశేషంగా మిగిలిపోతుంది.
అదే విధంగా పంట కోసిన తర్వాత మిగిలిపోయిన గడ్డిని ఇది వరకు రైతులు పశువులకు మేతగా ఉపయోగించేవారు. ఇప్పుడు పశువుల సంఖ్య తగ్గడం వల్ల వరి గడ్డి కూడా వ్యర్ధ పదార్ధంగా మారి పంట అవశేషంగా మిగిలిపోతుంది.
పంటకు పంటకు మధ్య సమయం తక్కువ ఉండడంతో వరి కోసిన తర్వాత మిగిలిపోయిన కొయ్య కాళ్ళు & వరి గడ్డిని కంపోస్ట్ గా మార్చుకోవడం పై రైతులకు అవగాహనా లేకపోవడంతో పాటు వీటిని కాల్చడం వల్ల పొలంలో వున్న కీటకాలను, వ్యాధి కారక జీవులను నశింపచేయవచ్చు అనే అపోహతో చాలా మంది రైతులు వరి కొయ్య కాళ్ళను, గడ్డిని తగలబెడుతున్నారు.
ఇలా పొలాల్లోనే తగలబెట్టడం వల్ల జరిగే నష్టాలూ మరియు అలా కాకుండా కంపోస్టుగా కాని లేదా రోటరీ మల్చర్ తో నేలలోనే కలియదున్నడం వల్ల జరిగే లాభాలను గురించి పరిశిలించినట్లైతే
నష్టాలు :-
- వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఉత్తర భారత దేశంలో ఈ కారణంగా శీతాకాలంలో తీవ్ర స్థాయిలో కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయి.
- ఇలా తగలబెట్టడం వల్ల నేలలోని పోషక గుణాలు నష్టపోవడమే కాకుండా మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోతున్నాయి.

సాధారణంగా ఈ సూక్ష్మజీవులు పంటకు వేసే ఎరువులను మొక్కలకు అందిస్తాయి. కాని అవి చనిపోవడం తో రైతులు వేసే ఎరువులు మొక్కకు అందే అవకాశం ఉండదు.
- కొయ్య కాళ్ళను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కర్భనం, కార్బన్ డై ఆక్సైడ్ గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది.
- పొగ, ధూళి కణాలు గాలిలో కలవడం వల్ల పర్యావరణం దెబ్బ తింటుంది.

నేలలో కలియదున్నడం వల్ల / కంపోస్ట్ చేయడం ద్వారా లాభాలు :
- వరి పంట కోసిన వెంటనే కొయ్య కాళ్ళను తగలబెట్టకుండా పొలంలో మిగిలిన తేమని ఉపయోగించుకొని దున్నటం వల్ల కొయ్య కాళ్ళు మట్టితో కప్పబడి కుళ్ళే ప్రక్రియ ప్రారంభమై వానాకాలం వరకు సేంద్రియ పదార్ధంగా మారుతుంది.

ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్ళు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి, తొలకరిలో పడిన వర్షపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోత అరికట్టబడుతుంది.ఒక టన్ను వరి గడ్డి పెరుగుదలకు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరం తో పాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి.ఈ కొయ్య కాళ్ళను భూమిలో కలియ దున్నడం వల్ల గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి. లేదా ఈ పంట అవశేషాల వ్యర్ధాలను కంపోస్ట్ చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు.

- వానాకాలంలో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి యాభై కిలోల సూపర్ ఫాస్పేట్ వేస్తే నేలలో మిగిలిపోయిన వరి కొయ్యలు తొందరగా కుళ్ళి పోతాయి. తర్వాత నాటే వరి పంటకు నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి.
- వరి కొయ్య కాళ్ళను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్భన శాతం పెరిగి పంట దిగుబడులు 5-10 % పెరిగినట్లు పరిశోధనల ద్వారా వెల్లడయ్యింది.
- వరి గడ్డిని కంపోస్ట్ గా చేసి సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవడం (రైతు అనుభవం)
- మానకొండూర్ మండలం కొండ పల్కల గ్రామానికి చెందిన శ్రీ రూపిరెడ్డి తిరుపతి రెడ్డి గారు అనే రైతు పంట కొత్త అనంతరం మిగిలిన వరి గడ్డిని కాల్చకుండా తన పొలం లోనే ఒక చివరన చిన్న గుంతగా తీసి అందులో కుప్పగా చేసి గడ్డిని నాలుగు లేదా ఐదు వరసలుగా పేర్చి పదిహేను రోజుల వ్యవధిలో 2/3 సార్లు వేస్ట్ డికంపోసేర్ ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారి చేయడం వల్ల 30-40 రోజులలో కంపోస్ట్ తయారు చేస్తున్నారు.
- ఇలా తయారు చేసిన సేంద్రియ ఎరువును నేలలో చల్లడం వల్ల భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి నేలలో పోషకాల లభ్యత పెరుగుతుంది.
- రోటరీ మల్చర్ ను ఉపయోగించి కొయ్య కాళ్ళను కాల్చకుండా భూమిలోనే కలియ దున్నడం.
- యాంత్రీకరణ లో భాగంగా కొయ్య కాళ్ళను కాల్చకుండా భూమి లోనే కలియ దున్నే విధంగా వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త లచే రోటరీ మల్చర్ అనే యంత్రాన్ని రూపొందించడం జరిగింది.
- ఈ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల కొయ్యకాళ్ళు చిన్న, చిన్న ముక్కలుగా విరిగి నీళల్లో తేలికగా కలిసిపోతాయి. తర్వాత కేజివీల్స్ ట్రాక్టర్ తో దున్నినప్పుడు వెంటనే మట్టిలో కలిసిపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడతాయి.
జె. విజయ్ (సేద్య విభాగపు శాస్త్రవేత్త), డా.ఎన్. వెంకటేశ్వరరావు (సీనియర్ శాస్త్రవేత్త, హెడ్), డి.శ్రీనివాస్ రెడ్డి (సస్య రక్షణ శాస్త్రవేత్త), డా. ఎల్. మహేష్ (విస్తరణ శాస్త్రవేత్త), ఫోన్ : 8500119198


























