Indian Government needs to resolve farmers issues దేశవ్యాప్తంగా 60 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. మనదేశంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యత అది. భారతదేశం నుంచి విదేశాలకు టన్నుల్లో ఆహారం సరఫరా అవుతుంటుంది. అంటే రైతు దేశానికి వెన్నుముక అని వేరే చెప్పాల్సిన పని లేదు. మరి మనదేశంలో రైతుకు విలువ ఉందా? పండించిన పంటకు సరైన మద్దతు ధర ఇవ్వకపోతే ఆ రైతు ముందుకు ఎలా సాగేది ? ఆరుగాలం పండించిన పంటకు కనీస ధర లభించక రోజు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.1995 నుంచి దేశంలో 10 వేలకు పైగా రైతులు ప్రతీ యేటా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 10 ఏళ్ల గణాంకాలు గమనిస్తే దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య లక్ష దాటింది. దేశంలో ఏ వ్యాపారవేత్త కూడా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి లేదు. కానీ దేశానికి అన్నం పెడుతున్న రైతు మాత్రం ఉరితాడుకు వేలాడాల్సి వస్తుంది. దీనికి కారణం ఎవరు? రోజు లక్ష కోట్లు, వేల కోట్లు అని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే పాలకులు రైతుల్ని కాపాడలేకపోతున్నారు. దేశంలో ఏ రైతు కూడా ఉచితంగా ఏదీ ఇవ్వమని కోరడు. కష్టపడుతాం..దానికి ప్రతిఫలం ఇవ్వండి అంటాడు. మరి ఆ సమస్యకు పరిష్కారం కూడా ప్రభుత్వాల చూపించలేవా?
పన్నుల రీత్యా కేంద్రం జిఎస్టీని అమలులోకి తీసుకొచ్చింది. జీఎస్టీని అర్ధరాత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ దేశానికి అన్నం పెడుతున్న రైతన్న గురించి ప్రభుత్వం ఒక్కసారి కూడా ద్రుష్టి పెట్టడానికి సమయం దొరకడం లేదా అంటూ నిపుణులు లేవనెత్తిన ప్రశ్న. ఇక పారిశ్రామిక వేత్తలతో గంటలకొద్దీ సమావేశాలు నిర్వహిస్తారు, మరి వ్యవసాయానికి సంబంధించిన ఏ సమావేశానికైనా రైతన్నని కానీ, రైతు నాయకులని కానీ ఆహ్వానించారా అన్నది వారి వాదన.
గత 20 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తే 2004లో అత్యధికంగా 18,241 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.2015లో 12,602 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, 2016లో ఈ సంఖ్య 6,867కి చేరింది.కాగా, మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రైతులు పెద్ద సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు ఎన్సీఆర్బీ నివేదికలో తెలుస్తోంది. ఈ రిపోర్టు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో 2014 లో 160 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, 2015లో ఈ సంఖ్య 516కు పెరిగింది. అంటే ఏడాది కాలంలో ఆత్మహత్యలు 322 శాతం పెరిగాయి. ఇక, తెలంగాణలో 2014లో 898 మంది ఆత్మహత్య చేసుకోగా, 2015లో ఈ సంఖ్య 1,358 కి పెరిగింది. 2014తో పోల్చితే ఈ సంఖ్య 152 శాతం ఎక్కువని ఎన్సీఆర్బీ గణాంకాలు తెలుపుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో అన్నదాతల సమస్యలపై పని చేస్తున్న రైతు స్వరాజ్య వేదిక చెబుతున్న లెక్కల ప్రకారం తెలంగాణలో 2016లో 774 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలోనే 134 మంది చనిపోయారని ఆ సంస్థ వెల్లడి చేసింది. 2017లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 155 మంది చనిపోయినట్లు రైతు స్వరాజ్య వేదిక స్థానిక మీడియాలో వచ్చిన ఆధారాలతో చెబుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోవడం, గిట్టుబాటు ధర రాకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే రైతులు ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయానికి వస్తున్నారని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు సాగు చట్టాల రద్దు అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఏదిఏమైనప్పటికి కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను నేడు పార్లమెంటులో రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ సాగు చట్టాలనే పట్టుకుని వేలాడుతుంది కానీ అసలు రైతుల సమస్యలేంటి? వారు డిమాండ్ చేస్తున్న అంశాలేంటి అన్న అంశాలపై మాత్రం పాలకులు చర్చించిన పాపాన పోలేదు. దీంతో రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మద్దతు ధరపై స్పష్టమైన క్లారిటీ వచ్చేవరకు తాము వెనక్కి తగ్గేదేలేదంటున్నారు. Indian Farmers