Tikait to attend Maha Dharna ఢిల్లీలో తారాస్థాయికి చేరి విజయం సాధించిన రైతుల ఉద్యమం హైదరాబాద్ కు చేరింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలపై రైతులు ఉదృత పోరాటం చేశారు. దాదాపుగా ఏడాదిపాటు కేంద్రంపై అలుపెరగని పోరాటం చేశారు. 40 రైతు సంఘాలతో సాగిన భారీ ఉద్యమంలో ఎంతో మంది రైతులు ప్రాణత్యాగం చేశారు. కాగా మరెంతో మంది రైతులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల రైతు సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లుని రద్దు చేస్తామని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ఢిల్లీ సరిహద్దులో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన రైతు సంఘాల అధినేతలు నేడు హైదరాబాద్ లో మరో ఉద్యమానికి తెర తీశారు.
Maha Dharna in Hyderabad రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతుగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీసీ) ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద గురువారం మహా ధర్నాకు సిద్ధమైంది.ఈ ధర్నాలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ హాజరుకానున్నారని ఏఐకేఎస్సీసీ నేతలు తెలిపారు. కనీస మద్దతు ధర చట్ట సాధన, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేత, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించి శాశ్వత ఉపాధి, కేంద్ర మంత్రి అజయ్కుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్లతో ఈ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐకేఎస్సీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ లో రైతుల మహాధర్నాకు రాకేష్ టికాయత్ రానుండటంతో ఈ ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాలు ఈ ధర్నాలు కూర్చోనున్నాయి. మరోవైపు ఇప్పటికే తెలంగాణ అధికార పక్షం కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి నేడు ధర్నా చౌక్ లో జరగనున్న మహాధర్నా ఎక్కడికి దారి తీస్తుందో.. Tikait