Regional Agricultural Research Station – Lam: కృష్ణా మండలం వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశము మొదటి రోజు కార్యక్రమాన్ని 20-4-2023 న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. ఎల్ ప్రశాంతి, పరిశోధనా సంచాలకులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా యమ్. వి. ఎస్. నాగిరెడ్డి, వైస్ చైర్మన్ అగ్రి మిషన్, ఆంధ్రప్రదేశ్ వారు పాల్గొని వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను, రైతుల నిఖర ఆదాయం పెరగాలంటే దిగుబడి పెరగడంతో పాటు సాగు ఖర్చును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను, వ్యవసాయంలో రోబోటిక్స్ ఉపయోగం వంటి అంశాలను వివరించారు. ముఖ్య అతిధి ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉపకులపతి డా. ఎ. విష్ణు వర్ధన్ రెడ్డి గారు వారి సందేశంలో దేశ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం చెందిన ముఖ్య పంటలలో రకాలను రూపొందించిన శాస్త్రవేత్తలను మరియు వాటిని విస్తృతంగా రైతుల్లోకి తీసుకువెళ్లిన విస్తరణ శాస్త్రవేత్తలను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేర్చడంలో తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ మరియు అనుబంధ శాఖల సమన్వయాన్ని కొనియాడారు. ఈ సందర్బంగా యమ్. వి. ఎస్. నాగిరెడ్డి గారికి ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉపకులపతి డా. ఎ. విష్ణు వర్ధన్ రెడ్డి గారు సన్మానం చేశారు.
Also Read: Dragon Fruit Cultivation: కాసుల పంట డ్రాగన్ ఫ్రూట్ సాగు వివరాలు – ప్రభుత్వ ప్రోత్సాహం

Regional Agricultural Research Station – Lam
సహ పరిశోధన సంచాలకులు డా. జి సుబ్బారావు గారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాం పరిధిలోని పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు ఏరువాక కేంద్రాలు గతంలో రైతులు వ్యక్తపరిచిన సమస్యలకు చేపట్టిన పరిశోధనా మరియు విస్తరణ ఫలితాలను నివేదిక రూపంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు డా. ఎల్ ప్రశాంతి గారు యాంత్రీకరణలో సాధించిన ఫలితాలు, అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం సందర్బంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. విస్తరణ సంచాలకులు డా. సుబ్బరామి రెడ్డి గారు నాణ్యమైన విధానాలను రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందించడం, శనగలో యంత్రీకరణ, విలువ జోడింపు వంటి అంశాలతో విస్తరణ కార్యక్రమాలు చేపట్టి ప్రగతి సాధించడానికి ప్రయత్నిస్తామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్. టి. ఆర్, ప్రకాశం మరియు బాపట్ల జిల్లాల జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొని వారి వారి జిల్లాల వ్యవసాయ పరిస్థితులు మరియు పంటల పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ బోర్డు ఛైర్మన్స్ మరియు రైతులు, రైతు మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు, ముఖ్య పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలను తెలియజేసి వాటి పరిష్కారాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: PJTSAU: కృషి విజ్ఞాన కేంద్రాలు(KVK) అనుసరించాల్సిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక.!