వార్తలు

చెరకు నర్సరీ సాగులో విజయం సాధించిన స్నేహితులు..

0

పదిమందికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు. కొన్నెండ్లు గా పైవేటు స్కూల్ లో పనిచేస్తున్నారు. కరోనా వల్ల స్కూళ్ళు మూతపడటంతో ఉద్యోగాలు పోయాయి. జాబ్స్ పోయినందుకు డీలా పడలేదు. చెరకు మొలకలను ఉత్పత్తి చేసే నర్సరీని పెట్టి సక్సెస్ అయ్యారు కుప్రియాల్ కు చెందిన నలుగురు యువకులు. వాళ్ళు బాగుపడడమే కాకుండా మరో పదకొండు మందికి పని కల్పించారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏ రంగంలో నైనా సక్సెస్ అవ్వొచ్చని నిరూపించిన వీళ్ల పేర్లు కమిటి నరేష్, రాజశేఖర్, చెవ్వ రారాజు, చెవ్వ సంతోష్.
వీళ్ల సొంతూరు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్. వీళ్లంతా చిన్నప్పటి నుంచి స్నేహితులు. నరేష్, రాజశేఖర్, రాజు బీఈడీ చేసి ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్లు గా పని చేశారు. సంతోష్ అదే స్కూల్ లో బస్సు డ్రైవర్ గా చేసేవాడు. పోయిన ఏడాది కరోనా కారణంగా స్కూళ్ళు మూతపడటంతో వీళ్ల ఉద్యోగాలు పోయి రోడ్డునపడ్డారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నవాళ్లకి.. చెరకు మొలకలు సాగు చేయాలన్న ఐడియా వచ్చింది. అనుకున్నదే తడవుగా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఎకరం భూమిని లీజుకు తీసుకుని, లోకల్ గా ఉన్న ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సాయంతో నర్సరీ స్టార్ట్ చేశారు. నర్సరీ మొదలుపెట్టేందుకు అవసరమైన ట్రేలు, చెరకు గడలా కటింగ్ మిషన్లు, కోకాఫేట్ (బయో పెస్టిసైడ్), ఇతర కెమికల్స్, మొలకలు సప్లయ్ చేసేందుకు మినీ వ్యాన్ కు కలిపి మొత్తం రూ. 10 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఈ నర్సరీ లో పనిచేసేందుకు 11 మంది మహిళా కూలీలను పెట్టుకుని, వాళ్లకి పని ఇస్తున్నారు. వ్యవసాయంపై పట్టు ఉండటంతో ఆ నర్సరీని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు.
చెరకు గడలను మిషన్లతో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఆ ముక్కలను కోకాఫేట్ వేసిన ట్రేలలో వేసి పెడతారు. దాదాపు 30 – 40 రోజుల్లో మొలకలు రెండు నుంచి నాలుగు ఇంచులు పెరుగుతాయి. ఒకేసారి 80 వేల నుంచి లక్ష వరకు మొలకలు వస్తాయి. ఆ మొలకలనే రైతులకు ఒక్కోటి రెండు రూపాయల చొప్పున అమ్ముతున్నారు. మాములుగా అయితే రైతులు చెరకు గడలను నరికి వాటిని నేరుగా భూమిలో తొక్కేవారు. వాటి నుంచి పిలకలు మొలిచి పంట వచ్చేది. ఆ పద్ధతి ఖర్చుతో కూడుకున్నది. కూలీలు కూడా బాగా అవసరమయ్యేవాళ్ళు. అయితే, ఈ మొలకలు తెచ్చి నాటుకుంటే ఖర్చు తగ్గుతుందని, టైం కలిసొస్తుందని చెప్తున్నారు రైతులు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల సింగిల్ కన్ను మొలకలు, 2.78 లక్షల 2 కళ్ల మొలకలను సప్లై చేశారు ఈ నలుగురు.
స్కూళ్ళు మూతపడ్డాక ఏం చేయాలో పాలుపోలేదు నెక్స్ట్ ఏంటన్న ఆలోచన మొదలైంది. ఆ టైం లోనే మా బంధువుల్లో ఒక మహిళ చెరకు మొలకలు ఉత్పత్తి చేసే నర్సరీలో పనికి వెళ్లడం చూసి మాకు ఈ ఐడియా వచ్చింది. చెరకు మొలకలకు రైతుల నుంచి కూడా మంచి డిమాండ్ ఉంది. ఫ్యాక్టరీ వాళ్లు, లోకల్ రైతులు సహకారం అందించడంతో దీన్ని స్టార్ట్ చేసాం. మాతో పాటు మరో 11 మందికి పని ఇవ్వడం ఆనందంగా ఉంది. ఏ పనైనా చేయాలనే తపన ఉంటే ఎక్కడైనా విజయం సాధించొచ్చు.

Leave Your Comments

తెలంగాణలో యాసంగి సాగు లక్ష్యం దాటింది..

Previous article

భూసార పరీక్ష సంచార వాహనాన్ని ప్రారంభించిన రాయగడ జిల్లాపరిషత్ అధ్యక్షుడు గంగాధర్..

Next article

You may also like