Palle Nidra: వనపర్తి నియోజకవర్గం ఖిల్లాఘణపురం మండలం ఆముదంబండ తండాలో పల్లెనిద్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు హాజరయ్యారు. వనపర్తి నియోజకవర్గ వ్యాపితంగా, రాష్ట్రంలోనే తొలిసారి వనపర్తి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సూచనల మేరకు వనపర్తి వజ్ర సంకల్పం పేరుతో 53 శాఖలకు చెందిన అధికారులతో 41 గ్రామాలు, 9 మున్సిపల్ వార్డులు మొత్తం 50 ఆవాసాలలో పల్లెనిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఖిల్లా ఘణపురం మండలకేంద్రంలో పల్లె నిద్రకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఖిల్లాఘణపురం మండలం కమాలుద్దీన్ పూర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశీష్ గారు, ఖిల్లాఘణపురం మండలం మామిడిమాడలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ గారు పాల్గొన్నారు.
రేవల్లి, గోపాల్ పేట, ఖిల్లాఘణపురం, పెద్దమందడి, శ్రీరంగాపురం, వనపర్తి మండలాలలో 6 గ్రామాల చొప్పున, పెబ్బేరు మండలంలో 5 గ్రామాల్లో పల్లె నిద్ర,పెబ్బేరు మునిసిపాలిటీలో 3 వార్డులు, వనపర్తిలో ఆరు వార్జులలో పల్లెనిద్రలు కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది.
వనపర్తి పల్లెనిద్రలు చారిత్రాత్మకం కావాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఇతరులకు ఆదర్శం కావాలి అని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం పెంచడం, వారి సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్రలు కార్యక్రమం చేపట్టానని ఆయన తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను అన్నారు. అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్రలు ఉపయోగపడ్డాయి అని అన్నారు. కర్నెతండా మీదుగా బలిజపల్లి అటవీ రోడ్డు, కరంటు సమస్యలు తీర్చేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యడం జరిగింది అని అన్నారు.
సాగునీటి కోసం రూ.76.19 కోట్లతో కర్నెతండా ఎత్తిపోతల సాధించాం. గిరిజనుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కర్నె తండాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తీసుకువచ్చాం తెలిపారు. ఆముదంబండ తండాలో గిరిజన భవన్ కు త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నామని అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతినెలా ప్రభుత్వం నిధులు ఇస్తున్నది అన్నారు. రైతుబంధు కింద ఈ తండాలో 185 మంది రైతులకు ఈ వానాకాలం రూ.25.51 లక్షలు వారి ఖాతాలలో జమచేయడం జరిగిందని.. వివిధ కారణాలతో మరణించిన నలుగురు రైతులకు వారి కుటుంబాలకు రైతుభీమా కింద రూ.5 లక్షల సాయం అందించామని తెలిపారు. 27 మందికి కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, 27 మందికి కేసీఆర్ కిట్ – అమ్మవడి పథకం, రూ.32 లక్షలతో మిషన్ భగీరధ కింద తాగునీటి సౌకర్యం, రూ.7 లక్షలతో మిషన్ కాకతీయ కింద చాతృకుంటకు మరమ్మతులు, తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందని నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుమూలంగా తండాలు గ్రామపంచాయతీలు అయ్యాయి అని.. మన తండాలో మన రాజ్యం అన్న గిరిజనుల కల నెరవేరిందని అన్నారు. మీ తండాలను మీరే అభివృద్ధి చేసుకునే అవకాశం లభించిందని తెలియపరిచారు. గత ఎన్నికలకు ముందు ముంబయి వెళ్తే దాదాపు 4 వేల మంది గిరిజనులు సమావేశానికి వచ్చారు. ఇటీవల మళ్లీ ముంబయి వెళ్లితే 1500 మంది మాత్రమే కనిపించారు .. సాగునీటి రాకతో వలసలు తగ్గాయని వారు చెప్పడం సంతోషం అనిపించిందని నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
Also Read: Storing Fruits and Vegetables: పండ్లు మరియు కూరగాయలు నిల్వ చేయుట గల ప్రాముఖ్యత.!