ఆంధ్రా వ్యవసాయం

మామిడి తోటలో పూత,కాయ మరియు సస్యరక్షణ చర్యలు

0

మామిడిలో పూత సాధారణంగా డిసెంబర్ నెల ఆఖరి వారంలో వస్తుంది. డిసెంబర్ మాసం ఆఖరున పూమొగ్గలు బయటకు వచ్చి మొత్తం పూత రావడానికి జనవరి మాసం ఆఖరి వరకు సమయం పడుతుంది. ఒక పూకొమ్మలో సుమారు 2 నుంచి 3 వేల పుష్పాలు ఉంటాయి. ఈ పూతలో 99 శాతం మొగ్గ పుష్పాలు ఉంటాయి. ఒక పూరెమ్మకు 5 నుండి 6 పిందెలు కడతాయి. ఈ 5 నుండి 6 పిందెలలో చివరికి ఒకటి నుంచి రెండు పిందెలు మాత్రమే ఎదిగి కాయలుగా మారుతాయి. కావున పిందె దశలో ఎక్కువ పిందెలు రాలకుండా తగు జాగ్రత్తలు వహించాలి.

  • మామిడిలో పూత రాలటం సహజం, మొగ్గ పుష్పాలు, ఫలదీకరణ చెందని పుష్పాలు రాలిపోతాయి.
  • అధిక ఉష్ణోగ్రత, బూడిద తెగుళ్ళు, తేనెమంచు, నీటి ఎద్దడి, అధిక తేమ, హార్మోన్ల లోపం వలన పిందె కాయ రాలిపోతుంది.
  • చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
  • మామిడి పిందెలు బఠాణి సైజు, నిమ్మకాయ సైజుల మధ్య ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడినివ్వాలి.
  • నాఫ్తలీన్ అసిటిక్ ఆమ్లం 20 పి.పి.యం (1 గ్రాము 10 మి.లీ. మిథనాల్/స్పిరిట్లో కరిగించి 50 లీటర్ల నీటలో కలిపి పిచికారి చేయాలి). లేదా ప్లానోఫిక్స్ 1 మి.లీ. 5 లీటర్ల నీటిలో కలిపి బఠాణి సైజు మరియు నిమ్మకాయ సైజులో పిచికారి చేయాలి.
  • 1 శాతం యూరియాను (10 గ్రాముల యూరియా + లీటరు నీటిలో కలిపి) నిమ్మకాయ సైజులో ఒకసారి, 20 రోజుల తరువాత రెండవసారి పిచికారి చేసి పిందె రాలడాన్ని నివారించుకోవచ్చు. లేదా 10 గ్రాములు మల్టీకె (13:0:45) లీటరు నీటికి కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు.

సస్యరక్షణ:

మామిడిలో పూ మొగ్గ దశ నుండి గోళి కాయ దశలో అధిక నష్టం కలిగించే చీడపీడలలో తేనెమంచు పురుగు, మసి మంగు, పక్షికన్ను మచ్చ తెగులు మరియు బూడిద తెగులు ముఖ్యమైనవి. ఈ చీడపీడలను రైతులు ముందుగానే గమనించి క్రింద ఇవ్వబడిన సస్యరక్షణ చర్యలను పాటిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చును.

మామిడిలో పూ మొగ్గ దశ నుండి గోళీ కాయ దశ వరుకు నెలవారిగా చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు:

పూత, కాయ దశ ఆశించే చీడ పీడలు సస్యరక్షణ చర్యలు పిచికారి చేసే సమయం
పూ మొగ్గ దశ తేనె మంచు పురుగు, పిండినల్లి, మసితెగులు, పక్షికన్ను తెగులు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. + గంధకం 2గ్రా. డిసెంబర్ 15-30
పచ్చి పూత దశ తేనె మంచు పురుగు, బూడిద తెగులు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. + హెక్సాకొనజోల్ 2 మి.లీ. జనవరి 15-30
నల్ల పూత దశ తేనె మంచు పురుగు, తామర పురుగులు, బూడిద తెగులు, పక్షికన్ను తెగులు ఎసిఫేట్ 1 గ్రా + థయోఫెనేట్ మిథైల్ 1 గ్రా. ఫిబ్రవరి 15-25
గోళీ కాయ దశ కాయ తొలుచు పురుగు, పిండినల్లి, పక్షికన్ను తెగులు, తొడిమకుళ్ళు తెగులు క్లోరీపైరిఫాస్ 2.5 మి.లీ. + కార్బెండిజిమ్ 1 గ్రా. మార్చి 1-15

 

తేనెమంచు పురుగు:

ఇవి మామిడి తోటల్లో ఏడాది పొడవునా ఉంటాయి. అయితే అవి నష్టం చేసేది మాత్రం పూత, కాత దశల్లోనే. పూత నుండి రసం పీల్చడంవల్ల పూత రాలిపోతుంది. ఈ పురుగులు విసర్జించిన తేనెవంటి జిగురుపై ’మసి తెగులు’ వృద్ధి చెందుతుంది.

నివారణ: దీని నివారణకు లీటరు నీటికి ఫాస్పామిడాన్ 0.5 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. కలిపి పూత మొదలయ్యే సమయం మరియు పిందెలు తయారయ్యే సమయం పూత, ఆకులపైనే కాకుండా మొదళ్ళ పైన, కొమ్మలపైన కూడా పిచికారి చేయాలి. పూలు పూర్తిగా విచ్చుకోకముందే పిచికారి చేయాలి. పూత బాగ ఉన్నపుడు పిచికారి చేయడం వలన పుప్పొడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గదశలో కనిపించిన ఎడల ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ + కార్బెండిజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మసి మంగు:

ఈ మసి తెగులు తేనె మంచు పురుగు, పిండినల్లి విసర్జించే తేనెలాంటి జిగిరు పదార్థం మీద వృద్ధి చెందుతుంది. మసి తెగులు ఆశించిన ఆకులపై, పూ గుచ్ఛంపై, కాయలపై, పండుపై మసి పూసినట్లుగా నల్లటి పొర ఏర్పడుతుంది. ఆకులపై ఏర్పడ్డ మసి లాంటి పొర వలన కిరణజన్య సంయోగక్రియకు అంతరాయమవుతుంది. అందుచేత పూగుత్తి సక్రమంగా వికశించదు, కాయ ఎదుగుదల తగ్గి నాణ్యత కోల్పోతుంది.

నివారణ: ముందు జాగ్రత్తగా తీపి పదార్థాన్ని విసర్జించే తేనెమంచు పురుగు, పిండినల్లిని నివారించుకోవాలి. నల్ల మసి మంగు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ చెట్ల ఆకులు, కొమ్మలు, రెమ్మలు తడిచేటట్లు పిచికారి చేయాలి. ఆకులపై మసిని తొలగించేందుకు 2 కిలోల గంజి పొడిని గోరువెచ్చని నీటిలో (3-4 లీ.) కలిపి ఉడికించి, తరువాత మిగితా నీరు పోసి 100 లీటర్ల గంజి ద్రావణం తయారు చేసి, తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజుల్లో పిచికారి చేయాలి.

బూడిద తెగులు:

ఈ తెగులు చలికాలంలో అంటే మామిడి పూత దశలో వస్తుంది. ఆకులు, పూత పిందెలపైన తెల్లటి బూడిద లాంటి పొడి ఏర్పడుతుంది. పూత, పిందె పసుపు రంగుకు మారి మగ్గి పోతుంది. తెగులు సోకిన ఆకు భాగం నల్ల రంగుకు మారును.

నివారణ: దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 2 గ్రా. లేక కెరాథేన్ 1 మి.లీ. లేక మైక్లోబ్యూటానిల్ 1 గ్రా. లేక బేలటాన్ 1 గ్రా. వీటిలో ఏదైన ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేసియాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మందును మార్చి పిచికారి చేయడం ద్వారా బూడిద తెగులును అరికట్టువచ్చు.

పక్షికన్ను మచ్చ తెగులు:

మామిడిని ఆశించు తెగుళ్ళలో ఎక్కువ నష్టం కలుగజేసేది ఈ మచ్చ తెగులు. ఇది ఆశించినప్పుడు గోధుమ రంగు మచ్చలు ఆకులు, పండ్లు, పూరెమ్మల మీద ప్రస్ఫుటంగా కనబడుతాయి. తెగులు ఉధృతంగా ఉంటే పూరెమ్మలు, పిందెలు రాలిపోయి, పూగుచ్ఛమంతా మగ్గిపోతుంది. దీని వల్ల కాపు ఉండదు. ఈ తెగులు ఆశించిన పండ్లు కుళ్ళిపోయి, చిన్న కొమ్మలు ఎండిపోతాయి. మబ్బులు, గాలిలో తేమ ఎక్కువైనప్పుడు ఇది బాగా వ్యాపిస్తుంది.నివారణ: కాయ కోతయ్యాక జూన్-జులై లో ఎండు కొమ్మల్ని కత్తిరించి ఒక లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి నెలవ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. పూత సమయంలో అయితే లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజిమ్ మొదటిసారి, 2.5 గ్రా. మాంకోజెబ్ రెండవ సారి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

Leave Your Comments

సేంద్రీయ వ్యవసాయంలో యాజమాన్య పద్దతులు

Previous article

ఎకరంలో 20 పంటలు.. లాభాలు గడిస్తున్న యువరైతు

Next article

You may also like