తెలంగాణవార్తలు

జూన్ 26 నుంచి జూన్ 30 వరకు తెలంగాణాలో సాగుదార్లకు సూచనలు

0

Telangana Weather Report : హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం  ఐదు రోజులలో(జూన్ 26 నుంచి జూన్ 30 వరకు) తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.

వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి జూన్ 3వ తేదీన ప్రవేశించి జూన్ 12వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి. ఉరుములు,మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోనికి ప్రవేశించిన తరువాత తేలిక పాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు నేలలో 60 నుంచి 75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15-20 సెం.మీ. లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు. మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి.
వేరుశనగ, సోయాచిక్కుడు, జొన్న, పెసర, కంది, మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.

వరి:
నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక (130-135 రోజుల) లేదా స్వల్పకాలిక (120- 125 రోజుల) వరి రకాల నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. 25రోజుల వయస్సున్న దీర్ఘకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి. నాట్లు వేసిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయటం వల్ల గాలి, వెలుతురూ బాగా ప్రసరించడంతో బాటు సుడిదోమ ఉదృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్బోప్యూరాన్ 3సిజి గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15-20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. రైతులు తెలంగాణ సోన వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. వరి సాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు కారకాలు ఉండి వరి పంటను ఆశిస్తాయి. వరి మొక్కలను పోలిన ఊద, ఓడిపిలి గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు 7.5మి.లీ. సైహలోఫాప్ పి-బ్యుటైల్ మందును 5లీటర్ల నీటిలో కలిపి 15రోజుల వయస్సు గల వరి నారుమడిలో పిచికారి చేయాలి.

పత్తి:
పత్తి పంటను జులై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కావున రైతులు వారికి అనుకూలమైన బి.టి. పత్తి రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఈ కాలువల ద్వారా నీటిని తీసివేయవచ్చు. పత్తి పంట విత్తిన 2 వారాల తర్వాత ముందు జాగ్రత్తలో భాగంగా రసం పీల్చే పురుగుల నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 నీలం రంగు జిగురు అట్టలను అమర్చలి. మొదటి దఫా పైపాటు నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 20 రోజుల తరువాత భూమిలో తేమ ఉన్నప్పుడు అందించాలి.

మొక్కజొన్న:
మొక్కజొన్న పంటను జులై 15వ తేదీ వరకు మద్య, దీర్ఘకాలిక (90-100 రోజులు మరియు 100-120 రోజులు) రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకునేందుకు అనుకూల సమయం. మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు గనుక పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. పంటను విత్తిన 15రోజుల వ్యవధిలో కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా కత్తెర పురుగు ఉదృతిని గమనించవచ్చు. ఆఖరి దుక్కిలో మొత్తం భాస్వారం, 1/3వ వంతు నత్రజని,సగం పొటాష్ ఇచ్చే ఎరవులను చివరి దుక్కిలో వేసుకోవాలి.

జొన్న:
జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు. జొన్నని ఎకపంటగా లేదా కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. అముదం: ఆముదం పంటను జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.

కంది:
కంది పంటను జులై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. కందిని ఎకపంటగా లేదా పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, పెసలు,  మినుములతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కంది పంటను విత్తే ముందు కిలో విత్తనానికి  2.5గ్రా. కాప్టాన్ లేదా 3గ్రా. థైరామ్ మరియు 10గ్రా. ట్రైకోడర్మా విరిడి మందు   కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే శీలీంద్రాల నుంచి పంటను కాపాడవచ్చు.
పెసర, మినుము:
పెసర, మినుము పంటను జులై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
వీటిని ఎకపంటగా లేదా పత్తి, కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
వరి సాగు చేసే పొలాల్లో, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాలలో పెసరను పైరుగా లేనిచో పచ్చి రొట్టగా విత్తుకోవాలి.పెసర, మినుము పంట విత్తిన 2 వారాల తర్వాత ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రసం పీల్చే పురుగుల నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు,  5 నీలం రంగు జిగురు అట్టలను అమర్చలి.

సోయాచిక్కుడు:
సోయాచిక్కుడు పంటను జులై మొదటి వారం వరకు విత్తుకునేందుకు అనుకూల సమయం. నీటి వసతి గల తేలికపాటి నేలలు కూడా సోయాచిక్కుడు సాగుకు అనుకూలం. వెడల్పాటి బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే విత్తన మోతాదు తగ్గటంతోపాటు సరైన సాంద్రతలో మొక్కలు ఉండి, సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయి. ఈ పద్ధతిలో భూమిలో ఎకువ తేమ నిలువ ఉండి పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అదేవిధంగా ఎక్కువ నీటిని పొలం నుంచి తీసివేయటానికి కాలువలు ఉపయోగపడతాయి. సోయాచిక్కుడు పంట విత్తిన 2 వారాల తర్వాత, కాండం తొలిచే ఈగ, తెల్లదోమను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు, 5 తెలుపు జిగురు అట్టలను అమర్చలి. ముందస్తు నివారణ చర్యలలో భాగంగా సోయాచిక్కుడులో స్టెమ్ గర్డర్ ను  నివారించడానికి 1500 పి. పి. ఎం. వేపనూనె మందును 5 మి.లీ. / లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

చెరకు:
తోట వయస్సు నాలుగు నెలలప్పుడు (జూన్ – జులై మాసాల్లో) మొక్కల వరుసల మొదళ్ళకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు.

కూరగాయల పంటలు:
కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లైతే నివారణకు 1500 పి. పి. ఎం. వేపనూనే మందును 5 మి.లీ. /లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకటానికి అనుకూలము. ఈ తెగులు నివారణకు 1గ్రా. కార్బెండజిమ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

బత్తాయి, నిమ్మ:
కొత్తగా తోటలు పెట్టి రైతులు 60 సెం.మీ. పొడవు, వెడల్పు, లోతు గల గుంతలు తీసి, దానిలో 5కిలోల పశువుల ఎరువు, 1కిలో సింగిల్ సూపర్ పాస్పేట్, 100గ్రా. క్లోరిపైరిపాస్ పొడి మందులను పై మట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి. నాణ్యమైన మొక్కలు నాటుకోవాలి. బత్తాయి, నిమ్మ తోటల్లో గజ్జి తెగులు (సిట్రస్ క్యాంకర్) నివారణకు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ మరియు 30 గ్రాములు కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందుని 10 లీటర్ల నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి.

సూమిడి:
రైతులు కోత అనంతరం 2-4 వారాల తరువాత ఎండు కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను,  అడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించినట్లయితే గాలి, వెలుతురు మొక్కకు బాగా లబిస్తుంది. పోయిన సంవత్సరం వచ్చిన పూత కాడలను వెనుకకు కత్తిరించుకొని 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తోటలో రాలిపోయిన, కుళ్ళిపోయిన, తెగుళ్ళు ఆశించిన కాయలతో పాటు ఎండుఆకులను,  కొమ్మలను సేకరించి తోటలకు దూరంగా కాల్చివేయాలి.

డా. పి.లీలా రాణి,ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ),
వ్యవసాయ వాతావరణ విభాగం ,రాజేంద్రనగర్

Leave Your Comments

జూన్ 22-26 తేదీల వరకు వాతావరణ విశ్లేషణ

Previous article

You may also like